ఆదాయం తగ్గుతుంది

4 May, 2019 00:54 IST|Sakshi

ఐటీ దిగ్గజం కాగ్నిజంట్‌ వెల్లడి

నిరాశపరిచిన మార్చి క్వార్టర్‌ ఫలితాలు  

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం కాగ్నిజంట్‌ కంపెనీ మార్చి క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, భారత్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగులు ఉన్న ఈ కంపెనీ జనవరి–డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం 15 శాతం తగ్గి 44.1 కోట్ల డాలర్లకు చేరింది.. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో నికర లాభం 52 కోట్ల డాలర్లు వచ్చింది. ఆదాయం 5 శాతం ఎగసి 411 కోట్ల డాలర్లకు చేరింది. 

సగం తగ్గిన ఆదాయ అంచనాలు..: నిరాశకర ఫలితాలను ప్రకటించిన ఈ కంపెనీ పూర్తి ఏడాది ఆదాయం అంచనాలను సగానికి పైగా తగ్గించింది. ఈ ఏడాది ఆదాయం 7–9 శాతం రేంజ్‌లో వృద్ధి చెందగలదని ఒక నెల క్రితం ఈ కంపెనీ పేర్కొంది. తాజాగా ఈ అంచనాలను 3.6–5.1 శాతానికి తగ్గంచింది. ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్‌ విభాగాల్లో వృద్ధి మందకొడిగా ఉండే అవకాశాలుండటంతో ఆదాయ అంచనాలను తగ్గించామని పేర్కొంది. ఈ ఏడాది రెండో క్వార్టర్‌ ఆదాయం అంచనాలు 3.9–4.9 శాతం రేంజ్‌లో ఉండగలవని వివరించింది.  

విఫలమయ్యాం..: మార్కెట్‌ అవకాశాలను సమర్థవంతగా అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యామని కంపెనీ సీఈఓ బ్రియాన్‌ హంఫ్రిస్‌ పేర్కొన్నారు. ఫ్రాన్సిస్‌ డిసౌజా నుంచి ఏప్రిల్‌ 1 నుంచి సీఈఓ పగ్గాలను హంఫ్రిస్‌ తీసుకున్నారు. 

>
మరిన్ని వార్తలు