కాగ్నిజెంట్‌ నిర్ణయంతో టెకీలకు షాక్‌..

23 Nov, 2019 16:41 IST|Sakshi

బెంగళూర్‌ : ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతకు దిగుతుండటంతో రానున్న నెలల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఊపందుకోనుంది. ప్రాజెక్టులు లేని ఉద్యోగుల బెంచ్‌ టైమ్‌ గరిష్ట పరిమితిని ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ తగ్గించడం ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. బిల్లింగ్‌ ప్రాజెక్టులపై లేని ఉద్యోగుల బెంచ్‌ టైమ్‌ను 60 రోజుల నుంచి 35 రోజులకు కాగ్నిజెంట్‌ తగ్గించింది. 35 రోజుల తర్వాత బెంచ్‌పై ఉన్న ఉద్యోగులను కంపెనీ సాగనంపుతుంది. ఈ ప్రక్రియ 60 నుంచి మూడు నెలల లోపు పూర్తవుతుంది.

గతంలో బెంచ్‌పై ఉన్న ఉద్యోగులకు తమ బిజినెస్‌ యూనిట్లలో లేదా ఇతర ప్రాజెక్టుల్లో అవకాశం పొందేందుకు అధిక గ్రేస్‌ టైమ్‌ను కంపెనీ కల్పించేది. ఇతర నగరాలకు వెళ్లేందుకు ఇష్టపడని ఉద్యోగులు, ఇతర డొమైన్లను ఎంచుకోని వారు మాత్రమే కంపెనీని వీడాల్సివచ్చేది. బెంచ్‌పై ఉన్న ఉద్యోగులకు పలు అవకాశాలు ఇవ్వకుండా నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునే నైపుణ్యాలను వారు విధిగా మెరుగుపరుచుకునేలా ఒత్తిడి పెంచేందుకే కాగ్నిజెంట్‌ నూతన బెంచ్‌ విధానాన్ని అనుసరిస్తున్నట్టు భావిస్తున్నారు. సంవత్సరాల తరబడి రెండంకెల వృద్ధిని నమోదు చేసిన కాగ్నిజెంట్‌ వృద్ధి రేటు ఇటీవల పడిపోవడంతో తిరిగి మెరుగైన వృద్ధిని సాధించేందుకు పలు చర్యలు చేపడుతోంది. మారుతున్న క్లయింట్‌ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు నైపుణ్యాలను సంతరిచుకునేలా కసరత్తు చేపట్టింది.

మరిన్ని వార్తలు