త్వరలోనే మేడిన్‌ ఇండియా ఫ్లైట్‌లో జర్నీ

26 Dec, 2017 12:09 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇక త్వరలోనే మీరు మేడిన్‌ ఇండియా విమానంలో ఎగరవచ్చు. హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ రూపొందించిన డార్నియర్‌ 228ను పౌర విమానాలుగా వాడేందుకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) అనుమతి ఇచ్చింది. 19 సీట్ల ఎయిర్‌క్రాఫ్ట్‌ అయిన డార్నియర్‌, ప్రస్తుతం రక్షణ దళాల కోసం వాడుతున్నారు. వాణిజ్యవసరాల కోసం దేశంలో రూపొందించిన తొలి విమానం ఇదే. డీజీసీఏ ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కు సర్టిఫికేషన్‌ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ విమానాన్ని హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, విమానయాన సంస్థలకు విక్రయిస్తోంది. 

ఉడాన్‌ స్కీమ్‌ కింద మోదీ ప్రభుత్వంలో వీటిని ప్రాంతీయ విమానాలుగా వాడుకోవచ్చని సీనియర్‌ ఏవియేషన్‌ అధికారి చెప్పారు. ఈ విమానాన్ని వాడుతున్న ఆపరేటర్లకు కొన్ని ప్రత్యేక ప్రోత్సహాకాలు అందిస్తామన్నారు. పౌర సేవలకు వినియోగించేందుకు నేపాల్‌, శ్రీలంక వంటి దేశాలకు కూడా ఈ విమానాన్ని అమ్మేందుకు హెచ్‌ఏఎల్‌ చూస్తోందని తెలిపారు. ఇది బహుళ అవసరాలకు వాడే తేలికైన విమానమని, ఈ విమానాన్ని ప్రత్యేకంగా యుటిలిటీ, కమ్యూటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌, థర్డ్‌ లెవల్‌ సర్వీసెస్‌, ఎయిర్‌ట్యాక్సీ ఆపరేషన్స్‌, కోస్ట్‌ గార్డ్‌ డ్యూటీస్‌ వంటి వాటికోసం రూపొందించామని హెచ్‌ఏఎల్‌ చెప్పింది. పౌర సేవలకు ఉపయోగించేందుకు గత నెలలోనే కాన్పూర్‌ విమానశ్రయంలో ఈ విమానానికి పరీక్షలు కూడా నిర్వహించారు. 

మరిన్ని వార్తలు