న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ ఔషధ, రసాయనాల కంపెనీ బేయర్, విత్తన రంగంలో అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీ అయిన మోన్శాంటో కొనుగోలును పూర్తిచేసినట్టు ప్రకటించింది. 63 బిలియన్ డాలర్లతో అమెరికాకు చెందిన మోన్శాంటోను కొనుగోలు చేసేందుకు 2016 సెప్టెంబర్లో బేయర్ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అమెరికా, భారత్ సహా ఈ కంపెనీల కార్యకలాలు నడుస్తున్న దేశాల్లోని అన్ని నియంత్రణ సంస్థల అనుమతులు రావడంతో గురువారం నాడు కొనుగోలు పూర్తయినట్టు బేయర్ ప్రకటన చేసింది.
బేయర్, మోన్శాంటో ఈ రెండు మన దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలే. బేయర్ సస్యరక్షణ ఉత్పత్తులను, ఔషధాలను మన దేశంలో వేర్వేరు విభాగాల ద్వారా మార్కెట్ చేస్తోంది. ఇందులో ఒక కంపెనీ బేయర్ క్రాప్ సైన్సెస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థ. మోన్శాంటో బీటీ విత్తనాలను విక్రయిస్తోంది.