మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.91 శాతం

14 Apr, 2020 05:01 IST|Sakshi

ఫిబ్రవరి కన్నా తగ్గినా... ఆర్‌బీఐ లక్ష్యానికి దూరంగానే!

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2020 మార్చిలో 5.91 శాతంగా నమోదయ్యింది. అంటే రిటైల్‌ ఉత్పత్తుల బాస్కెట్‌ ధర  2019 మార్చి ధరలతో పోల్చితే 2020 మార్చిలో 5.91 శాతం పెరిగిందన్నమాట. నిజానికి ఫిబ్రవరిలో నమోదయిన 6.58 శాతంకన్నా ఇది తక్కువే. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం నిజానికి 2 శాతం ఉండాలి. అయితే ఈ స్థాయికి మైనస్‌ రెండు, లేదా ప్లస్‌ రెండు కూడా తగిన స్థాయిగానే పరిగణించడం జరుగుతుంది. దీనిప్రకారం 5.91 శాతం రిటైల్‌ ద్రవ్యోల్బణం అంటే కొంత ఆందోళనకర అంశమే. తక్కువ స్థాయి వడ్డీరేట్ల సరళతర ద్రవ్య పరపతి విధానం అనుసరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థాయి భారీ రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు భారంగానే ఉంటుంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన ద్రవ్యోల్బణం గణాంకాలను విభాగాల వారీగా చూస్తే...  

► ఆహారం, పానీయాలు: ఈ విభాగం మొత్తంగా ద్రవ్యోల్బణం రేటు 7.82 శాతంగా ఉంది.  ఈ విభాగంలో కూరగాయలు (18.63 శాతం), పప్పులు, పప్పు దినుసులు (15.85 శాతం), తృణ ధాన్యాలు (5.30 శాతం), మాంసం, చేపలు (9.15 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (6.47 శాతం), నూనె, కొవ్వు పదార్థాలు (7.54 శాతం), గుడ్లు (5.56 శాతం), సుగంధ ద్రవ్యాల (9.82 శాతం) ధరలు ఐదు శాతంపైగా పెరిగాయి. కాగా నాలుగు శాతంలోపు  ధరలు పెరిగిన ఉత్పత్తుల్లో పండ్లు (3.56 శాతం), చక్కెర, తీపి పదార్థాల ఉత్పత్తులు (3.85 శాతం), ఆల్కహాలేతర పానీయాలు (2.24 శాతం), ప్రిపేర్డ్‌ మీల్స్‌ , స్నాక్స్‌ (2.84 శాతం) వంటివి ఉన్నాయి.  
► పాన్, పొగాకు ఇతర మత్తు ప్రేరిత పదార్థాలు: ద్రవ్యోల్బణం 4.71 శాతం
► దుస్తులు, పాదరక్షల విభాగం: ధరల స్పీడ్‌ 2.11 శాతంగా ఉంది.  
► హౌసింగ్‌: 4.23 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది.
► ఫ్యూయెల్‌ అండ్‌ లైట్‌: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 6.59 శాతంగా ఉంది.

>
మరిన్ని వార్తలు