♦ పండుగల సీజన్లో అమ్మకాల హవా
♦ గతేడాది కంటే 25% అధికం
♦ డిస్కౌంట్లతో కంపెనీల రె‘ఢీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అక్షరాలా 25,000 కోట్లు.. ఈ పండగల సీజన్లో భారతీయ కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్కు ఖర్చు చేయబోయే మొత్తమిది. ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం జరగబోతోందంటే ఈ-కామర్స్ కంపెనీలు ఏ స్థాయిలో డిస్కౌంట్లు, ఆఫర్లతో రెడీగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. బహుశా! ఈ సీజన్ కంపెనీలకు అధిక లావాదేవీల సీజన్గా నిలుస్తుందని అసోచామ్ అంచనా వేస్తోంది. 2015 పండగల సీజన్లో భారతీయ కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్కు రూ.20,000 కోట్లు ఖర్చు పెట్టారు.
ప్రస్తుత సీజన్లో 25 శాతం వృద్ధి ఉంటుందని అసోచాం సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ ఈ సందర్భంగా తెలిపారు. 25-40 ఏళ్ల మధ్య ఉన్న 2,500 మంది వృత్తి నిపుణులపై అసోచాం సర్వే నిర్వహించింది. 60 శాతం మంది ఆన్లైన్ షాపింగ్ చేయనున్నట్టు వెల్లడించారు. దుకాణాల ముందుండే క్యూ లైన్లను తప్పించుకోవడానికే ఆన్లైన్ను ఎంచుకోనున్నట్టు వారు చెప్పారు.
కీలకం కానున్న డిస్కౌంట్లు..: లాభదాయక డీల్స్, డిస్కౌంట్లుండే ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది కస్టమర్లు మొగ్గు చూపినట్టు అసోచాం తన సర్వేలో వెల్లడించింది. దుస్తులు, ఉపకరణాలు, సౌందర్య సాధనాలు, ఆభరణాలు మొదలు మొబైల్స్, ల్యాప్ట్యాప్స్, టెలివిజన్లపై ఈ-కామర్స్ కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా కంపెనీలు ఈసారి పొరపాట్లు జరగకుండా చూడాలని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. సర్వేలో వాహన, బయోటెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా సేవలు, ఐటీ, మీడియా, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాలకు చెందినవారు పాల్గొన్నారు. హైదరాబాద్సహా 10 నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు.