ఈ రంగాల్లో భారీగా ఉద్యోగాల కోత

20 May, 2020 13:17 IST|Sakshi

ముందు వరుసలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

కోవిడ్‌-19 మహమ్మారి పంజా విసరడంతో చాలామంది వైరస్‌ ధాటికి తట్టుకోలేక ప్రాణాలుకోల్పోయారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చివురుటాకులా వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వేలమందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయి, నిర్వహణ, వ్యయభారాలను తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోత విధిస్తున్నాయి. ఈక్రమంలో వివిధ కంపెనీలలో పనిచేస్తోన్న కాంట్రాక్ట్‌(తాత్కాలిక) ఉద్యోగుల తొలగింపుకు మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్‌, ఇన్సురెన్స్‌, రిటైల్‌, ఈ-కామర్స్‌, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో పనిచేస్తోన్న తాత్కాలిక ఉద్యోగులపై అధికంగా కోత విధిస్తున్నారు. తద్వారా కంపెనీల నిర్వహణ వ్యయాలను కొంతమేర తగ్గించుకోవచ్చని యజమాన్యాలు భావిస్తున్నాయి. 

ఆయా కంపెనీలకు వర్క్‌ ఆర్డర్లు ఇచ్చే క్లైంట్లు సైతం తమ ఆర్డర్లను తగ్గించేశారు. కొంత మంది ఆర్డర్లు ఇచ్చిన్పటికీ సర్వీసులపై డిస్కౌంట్లు అడుగుతున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో వ్యాపారాలను సజీవంగా నిలుపుకునేందుకు డిస్కౌంట్లు ఇవ్వక తప్పని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అధిక సంఖ్యలో ఉన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేక ఆయా కంపెనీల హెచ్‌ఆర్‌ టీమ్‌లు ఉద్యోగులకు తొలగింపు పత్రాలను పంపుతున్నాయి. మరికొన్ని కంపెనీలు అయితే ఉద్యోగుల సంఖ్య తగ్గించాలా?లేదా వేతనాల్లో కోత విధించాలా అని ఆలోచిస్తున్నాయి. 

బీ2బీ ఈ-కామర్స్‌ స్టార్టప్‌ కంపెనీ ఉడాన్‌ ఏప్రిల్‌ నెలలో 10-15 శాతం తాత్కాలిక ఉద్యోగులపై కోత విధించింది.దీని ప్రభావం 3000 మందిపై పడింది. ఇదే నెలలో ఆన్‌లైన్‌లో గోల్డ్‌లోన్‌లు నిర్వహించే రూపిక్‌ కంపెనీ సైతం ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపు 600 మంది బ్లూ, గ్రే కాలర్‌ ఉద్యోగులను పరోక్షంగా ప్రభావితం చేసింది. ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫాంలు అయిన జొమాటో, స్విగ్గీలు కూడా వేతనాల్లో సవరింపులు చేసి తిరిగి ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటామని తెలిపాయి. తాజాగా ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ షేర్‌చాట్‌ బుధవారం 101 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ సంఖ్య కంపెనీ సిబ్బందిలో నాలుగో వంతుగా ఉంది. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా అడ్వర్టైజింగ్‌ మార్కెట్‌ దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. 

Related Tweets
మరిన్ని వార్తలు