‘మౌలిక’రంగం తిరోగమనంలోనే...

1 Nov, 2019 00:12 IST|Sakshi

సెప్టెంబర్‌లో పేలవ పనితీరు

ఉత్పాదకత 5.2 శాతం క్షీణత  

న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్‌ సెప్టెంబర్‌ ఫలితాలు ప్రతిబింబించాయి. సమీక్షా నెల్లో ఈ గ్రూప్‌లో అసలు వృద్ధిలేకపోగా – 5.2 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 సెప్టెంబర్‌ ఉత్పత్తితో పోల్చితే 2019 సెప్టెంబర్‌లో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యిందన్నమాట. గురువారం విడుదలైన అధికారిక  గణాంకాల ప్రకారం...
ఎరువుల ఉత్పత్తి తప్ప అన్నీ మైనస్‌లోనే...

► బొగ్గు (–20.5 శాతం), క్రూడ్‌ ఆయిల్‌ (–5.4 శాతం), సహజ వాయువు (–4.9 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–6.7 శాతం), సిమెంట్‌ (–2.1 శాతం), స్టీల్‌ (–0.3 శాతం) విద్యుత్‌ (–3.7 శాతం) క్షీణతను నమోదుచేసుకున్నాయి. అయితే ఒక్క ఎరువుల రంగం మాత్రం 5.4 శాతం ఉత్పత్తి వృద్ధిని నమోదుచేసుకుంది.  
► 2018 సెప్టెంబర్‌లో ఈ 8 పరిశ్రమల వృద్ధిరేటు 4.3%.
► కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ చూస్తే– ఈ కాలంలో వృద్ధి కూడా కేవలం 1.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5.5 శాతంగా ఉంది.  
► పారిశ్రామిక రంగంలో తీవ్ర మందగమన పరిస్థితులు నెలకొన్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ పేర్కొంది.  
► మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వాటా దాదాపు 40 శాతం.

మరిన్ని వార్తలు