పరిశ్రమలకు ఆర్థిక సాయంపై కసరత్తు

7 Apr, 2020 09:11 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నుంచి పరిశ్రమలను బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. గత నెలలో రూ.1.70 లక్షల కోట్ల మేర పేద ప్రజలకు సాయమందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్యాకేజీని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. దేశవ్యాప్తంగా మూడు వారాల పాటు లౌక్‌డౌన్‌ (అన్ని కార్యకలాపాలను నిలిపివేసి, ఎక్కడివారక్కడే ఉండేలా చేయడం) విధించగా, అది ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. (కరోనా పడగ: అంబానీ సంపద ఆవిరి)

లౌక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ ప్రభావితమయ్యే రంగాలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించే ఓ ప్యాకేజీని కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించే పనిలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనికితోడు పేదలు, బలహీన వర్గాల వారిపై ప్రభావాన్ని తగ్గించే మరిన్ని సహాయక చర్యలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన పరిస్థితులను పర్యవేక్షించేందుకు గత వారం ప్రధాన మంత్రి కార్యాలయం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి నేతృత్వంలో ఏడుగురు సభ్యుల సాధికార గ్రూపును ఏర్పాటు చేసింది. కాగా, ప్రభుత్వం నుంచి ప్రకటన లౌక్‌డౌన్‌ ముగిసేనాటికి వస్తుందని సమాచారం. (చదవండి: బ్యాంక్‌లపై కరోనా పిడుగు)

మరిన్ని వార్తలు