కోవిడ్‌-19 ఎఫెక్ట్‌: ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు

4 Mar, 2020 08:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

26 ఏపీఐలు, మందులకు వర్తింపు 

జాబితాలో పారాసెటమల్, బీ1, బీ12 

సాక్షి, న్యూఢిల్లీ:  భారత దేశంలో కూడా  కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ఔషధాల లభ్యతకు సమస్యలు లేకుండా చూడటంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 26 యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియంట్స్‌ (ఏపీఐ), ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. పారాసెటమల్, విటమిన్‌ బీ1, బీ12 మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.

తాజా ఆంక్షలతో ఇకపై వీటి ఎగుమతుల కోసం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. తదుపరి ఆదేశాలిచ్చే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని డీజీఎఫ్‌టీ మంగళవారం ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఔషధాల తయారీలో కీలకమైన ఏపీఐల కోసం భారత్‌ ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతున్నప్పటికీ .. పరిమిత స్థాయిలో ఎగుమతులు కూడా చేస్తోంది. కరోనా వైరస్‌ ధాటికి చైనా నుంచి సరఫరా దెబ్బతిన్న కారణంగా .. దేశీయంగా ఏపీఐలు, ఔషధాల కొరత తలెత్తకుండా కేంద్రం తాజా చర్యలు తీసుకుంది. కేంద్ర ఫార్మా విభాగం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ.. ఈ మేరకు సిఫార్సులు చేసింది.  

మరిన్ని వార్తలు