ఐక్యరాజ్యసమితి: కోవిడ్–19 వల్ల ఒక్క ఫిబ్రవరిలోనే 50 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ ఎగుమతులకు విఘాతం కలిగి ఉండవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనావేసింది. ముఖ్యంగా తయారీ రంగ ఎగుమతులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొన్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యం, కమోడిటీలకు సంబంధించి యూఎన్సీటీఏడీ (యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్) విభాగం చీఫ్ పమేలా కోక్–హమిల్టన్ ఈ అంశంపై మాట్లాడారు. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ)ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. ఈ సూచీ ఫిబ్రవరిలో 20 పాయింట్లు పడిపోయి 37.5కు చేరిన విషయాన్ని ప్రస్తావించారు. 2004 తర్వాత ఈ స్థాయికి సూచీ పడిపోవడం ఇదే తొలిసారి.