కరోనా సంక్షోభం : ముకేశ్ అంబానీ నష్టం ఎంతంటే

6 Apr, 2020 17:18 IST|Sakshi
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (పైల్ ఫోటో)

సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి ప్రకంపనలకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలవుతున్నాయి. కోవిడ్ -19 ను అడ్డుకునే క్రమంలో దేశంలో 21 రోజుల లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు ఆర్థిక కష్టాల్లోకి జారుకుంటున్నాయి.  దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు భారీగా ప్రభావితమవుతోంది. ఫలితంగా అటు ప్రపంచ స్టాక్ మార్కెట్లు, ఇటు దేశీయ  ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు  చేస్తున్నాయి.  దేశీయ మార్కెట్లలో వచ్చిన ఈభారీ దిద్దుబాటు కారణంగా మార్చి 31 నాటికి భారతీయ కుబేరుడు, రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్  అధినేత ముకేశ్  అంబానీ సంపద భారీగా పడిపోయింది. అంబానీ  నికర విలువ  రెండు నెలల్లో  28 శాతం లేదా 300 మిలియన్ డాలర్లు తగ్గి 48 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఒక నివేదిక సోమవారం తెలిపింది. అతని సంపద 19 బిలియన్ డాలర్లు క్షీణించడంతో, ప్రపంచ ర్యాంకింగ్‌ లో ఎనిమిది స్థానాలు తగ్గి, 17 వ స్థానానికి పడిపోయారని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ తెలిపింది.

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ తాజా నివేదిక ప్రకారం.. కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలల్లో ముకేశ్ నికర విలువలో దాదాపు 19 బిలియన్ డాలర్లు (రూ.1.44 లక్షల కోట్లు) నష్టాన్ని మూటగట్టుకున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో రూ.1,400గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ల విలువ ఏప్రిల్ 3వ తేదీ నాటికి 1,077కి పడిపోయింది.  కోవిడ్-19 సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నష్టపోయిన ధనికుల్లో అంబానీ రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం ఎఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నాడ్ అర్నౌల్ట్ ఉన్నారు. ఈయన సంపద 28 శాతం లేదా 30 బిలియన్ డాలర్లు తగ్గి 77 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక అమెజాన్ జెఫ్ బెజోస్ 131 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. గత రెండు నెలల్లో కేవలం 9 శాతం మాత్రమే పడిపోయింది. బిల్ గేట్స్ 91 బిలియన్ డాలర్ల  (14 శాతం తగ్గింది)గా వుంది.

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నివేదిక ప్రకారం నికర విలువలో గౌతమ్ అదానీ 5 బిలియన్ డాలర్లు (37 శాతం) , హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్ నడార్ 5 బిలియన్ డాలర్లు (26 శాతం), ఉదయ్ కోటక్ 4 బిలియన్ డాలర్ల (28 శాతం) నష్టపోయారు. అంతేకాదు ఓయో రూమ్స్ రితేష్ అగర్వాల్ ఇకపై బిలియనీర్ కాదు అని రిచ్ లిస్ట్ తెలిపింది. గత రెండు నెలల్లో భారతదేశంలో వ్యాపారవేత్తలు స్టాక్‌మార్కెట్లలో దాదాపు 25శాతం నష్టాలు చవిచూశారు, అంతేకాక.. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 5.2శాతానికి పడిపోయింది. ముఖ్యంగా  అంబానీకి ఇది గడ్డుకాలం.. ఆయన ఆస్తిలో దాదాపు 28శాతం నష్టం వచ్చిందని  హురున్ ఎండీ అనస్ రహ్మన్ వెల్లడించారు.  టాప్ 100 జాబితా నుంచి ముగ్గురు భారతీయులు  తప్పుకోగా, ఈ జాబితాలో నిలిచిన ఏకైక భారతీయుడుగా అంబానీ నిలిచారు.

బెర్క్‌షైర్ హాత్‌వేకు చెందిన వారెన్ బఫెట్ కూడా గత రెండు నెలల్లో 19 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. అయితే 19 శాతం వద్ద ఇది స్వల్ప పతనమని నివేదిక తెలిపింది. సంపదను కోల్పోయిన వారి టాప్ -10 జాబితాలో కార్లోస్ స్లిమ్, వారి కుటుంబం,  బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ ,  మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ ఉన్నారు. గత రెండు నెలల్లో చైనా బిలియనీర్లు కొద్దిమంది లాభాలలో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ , పంది మాంసం ఉత్పత్తి చేసే సంస్థల ప్రమోటర్లు కూడా ఉన్నారు. టాప్ -100 ర్యాంకింగ్స్‌లో భారత్ మూడు ర్యాంకింగ్స్‌ను కోల్పోగా,  ఆరుగురు చైనా  బిలియనీర్లు ఈ జాబితాలో చేరడం విశేషం.

చదవండి :  రికార్డు కనిష్టానికి బంగారం దిగుమతులు
 దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్

మరిన్ని వార్తలు