ఉద్యోగులకు రెనాల్ట్ ఇండియా వరాలు

4 Jun, 2020 10:22 IST|Sakshi

15 శాతం వేతనాలు పెంపు , ప్రమోషన్లు

డీలర్లకు ఆర్థిక సాయం

సాక్షి,  ముంబై: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో ఆదాయాలను కోల్పోయిన పలు సంస్థలు ఉద్యోగాల కోత, వేతనాలు తగ్గింపు లాంటి నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న తమ ఉద్యోగులకు అండగా నిలవాలని భావించింది.  వేతనాలు పెంపు, పదోన్నతులు ప్రకటించి ప్రత్యేకంగా నిలిచింది. తన సిబ్బంది మనోస్థైర్యాన్ని పెంచడం కీలకమని, అందుకే ఈనిర్ణయం తీసుకున్నామని రెనాల్ట్ ఇండియా తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరంలో 10-12 శాతం పోలిస్తే ఈ పెంపు ఎక్కువగా ఉండటం మరో విశేషం. 

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం కరోనా, లాక్ డౌన్  ప్రభావం ఉన్నప్పటికీ రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఐపిఎల్) తన ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును అమలు చేయనుంది. 2021 ఆర్థిక సంవత్సరానికి పదోన్నతులు కూడా ఇస్తోంది. ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చేలా 250 మంది ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును ప్రకటించింది. అలాగే 30 మందికి పైగా అధికారులకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే జీతాల పెంపు నుంచి తన భాగస్వాములైన నిస్సాన్, రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ ఇండియాను మినహాయించింది. మరోవైపు ఉద్యోగులకు జీతాలందించేందుకుగాను  తన డీలర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.  కార్లు,  విడిభాగాలపై మార్జిన్‌ను 200-300 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.

చదవండి :  మారుతికి షాక్ : టాప్ సెల్లింగ్ కార్ ఇదే!

మరిన్ని వార్తలు