కేంద్రం కీలక నిర్ణయాలు : స్టాక్‌ మార్కెట్‌ జోరు

20 Sep, 2019 11:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇచ్చేందుకు కార్పొరేట్‌ పన్నుల్లో కోత విధించారు. దేశీయ కంపెనీల కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 34.94 శాతం నుంచి 25.17 (సర్‌చార్జ్‌లు సెస్‌ కలిపి) శాతానికి తగ్గించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయ కంపెనీలు రాయితీలు, ప్రోత్సాహకాలు పొందకుంటే ఆయా కంపెనీలకు 22 శాతం కార్పొరేట్‌ పన్ను వర్తింపచేసింది. 2019 అక్టోబర్‌ 1 తర్వాత తయారీ రంగంలో తాజా పెట్టుబడులతో ప్రారంభించే దేశీయ కంపెనీలకు కేవలం 15 శాతం ఆదాయ పన్ను చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు.నూతన పన్ను రేట్లు, ఇతర ఊరట ఇచ్చే చర్యలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభమైన ఏప్రిల్‌ 1 నుంచే వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపుల విషయంలో నూతన నిబంధనలకు అనుగుణంగా సర్ధుబాటు చేస్తామని తెలిపారు.

కాగా కార్పొరేట్‌ పన్ను రేట్ల తగ్గింపు, ఊరట కల్పించే చర్యలతో కేంద్రానికి ఏటా రూ 1.45 లక్షల కోట్ల ఆదాయం గండిపడుతుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో జోరు పెంచేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఉత్పత్తి రంగంలోకి పెట్టుబడులను ముమ్మరం చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కాగా కేంద్రం ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లలో జోష్‌ నెలకొంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 1400 పాయింట్ల లాభంతో 37,550 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 424 పాయింట్ల లాభంతో 11,128 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. గత కొన్ని సెషన్‌లలో మందకొడిగా సాగుతున్న మార్కెట్లకు ఆర్థిక మంత్రి ప్రకటన ఉద్దీపనలా పనిచేసింది. .

మరిన్ని వార్తలు