రతన్‌ టాటాకు నోటీసులు

18 Dec, 2018 10:52 IST|Sakshi
టాటా సన్స్‌ మాజీ చీఫ్‌ రతన్‌ టాటా (ఫైల్‌ఫోటో)

సాక్షి, ముంబై : వాదియా గ్రూప్‌ చైర్మన్‌ నస్లీ వాదియా దాఖలు చేసిన పరువు నష్టం కేసులో స్ధానిక కోర్టు టాటా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ రతన్‌ టాటాతో సహా ప్రస్తుత చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖర్‌, సంస్థకు చెందిన ఎనిమిది మంది డైరెక్టర్లకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే ఏడాది మార్చి 25కు వాయిదా వేసింది. 2016, అక్టోబర్‌ 24న గ్రూప్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్ర్తీని తొలగించిన తర్వాత రతన్‌ టాటాతో పాటు ఇతరులు తన ప్రతిష్టను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ అదే ఏడాది వాదియా ఫిర్యాదు చేశారు. 

పలు టాటా సంస్థల్లో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా బోర్డులో కొనసాగుతున్న వాదియాను 2016 డిసెంబర్‌ నుంచి 2017 ఫిబ్రవరి మధ్య జరిగిన ప్రత్యేక సమావేశాల్లో వాటాదారులు తొలగించారు. మిస్ర్తీతో కలిసి వాదియా టాటా గ్రూప్‌ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేశారని నిందితులు ఆరోపించారని వాదియా తరపు న్యాయవాది అబద్‌ పోండా మెట్రపాలిటన్‌ మేజిస్ర్టేట్‌ కోర్టుకు వివరించారు. అయితే నస్లీ వాదియాను ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా తొలగించడంలో చట్టబద్ధమైన ప్రక్రియలను అన్నింటినీ చేపట్టామని టాటా సన్స్‌ ప్రతినిధి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు