ఈడీ కస్టడీకి రాణా కపూర్‌

8 Mar, 2020 14:19 IST|Sakshi

ముంబై : యస్‌ బ్యాంక్‌ వ్యవస్ధాపకుడు రాణా కపూర్‌ను మార్చి 11 వరకూ ఈడీ కస్టడీకి ముంబై కోర్టు అప్పగించింది. యస్‌ బ్యాంక్‌ సంక్షోభం నేపథ్యంలో బ్యాంక్‌ మాజీ చీఫ్‌ రాణా కపూర్‌ను దాదాపు 30 గంటల ఇంటరాగేషన్‌ అనంతరం ఆదివారం తెల్లవారుజామున ఈడీ అరెస్ట్‌ చేసింది. ఈడీ అధికారులు శనివారం రాణా కపూర్‌ను మనీల్యాండరింగ్‌ నియంత్రణ చట్టం కింద సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆదివారం కపూర్‌ భార్యను సైతం ఈడీ కార్యాలయానికి రప్పించిన అధికారులు ఆమెను పలు కోణాల్లో ప్రశ్నించారు. ముంబైలోని వొర్లి ప్రాంతంలో కపూర్‌ నివాసం సముద్ర మహల్‌లోనూ ఈడీ అధికారులు దాడులు చేపట్టారు. కపూర్‌ నేతృత్వంలో యస్‌ బ్యాంక్‌ పెద్ద మొత్తంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు జారీ చేసిన రుణాలు నిరర్థక ఆస్తులుగా (ఎన్‌పీఏ) మారాయని ఈడీ ఆరోపిస్తోంది. కాగా యస్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు ఊరటగా కస్టమర్లు తమ డెబిట్‌ కార్డును ఉపయోగించి ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని యస్‌ బ్యాంక్‌ ట్వీట్‌ చేసింది. మరోవైపు సంక్షోభంలో కూరుకుపోయిన యస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐ 49 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. యస్‌ బ్యాంక్‌ ఉద్దీపన ప్రణాళిక కింద ఎస్‌బీఐ తన నివేదికను సోమవారం ఆర్బీఐకి సమర్పించనుంది

చదవండి : ఎస్‌బీఐలో యస్‌బ్యాంక్‌ విలీనం కాదు: రజనీష్‌.

మరిన్ని వార్తలు