ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తోంది. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులో ఎస్బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) పలు పరిష్కార మార్గాలతో ఓ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ద్రవ్య, ఆర్థిక విధానాలలో పలు సంస్కరణలను అమలు చేయాలని తెలిపింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ద్రవ్య డిమాండ్ను పెంచడానికి ప్రయత్నాలు చేయాలని సూచించింది.
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్య రంగాలపై ఆర్బీఐ దృష్టి కేంద్రీకరించాలని.. కీలక రంగాలైన హోటల్, ఏవియేషన్, రవాణా, టూరిజం రంగాలపై ఆర్బీఐ దృష్టి సారించాలని తెలిపింది. ఎకానమీ బలోపేతానికి ఈ రంగాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడింది. ఈ సంక్షోభంలో ఆర్బీఐ డిజిటల్ చెల్లింపులకు మరింత ప్రోత్సాహకాలు అందించాలని పేర్కొంది. కరోనా వ్యాప్తి వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం దేశానికి కలిసొచ్చే అంశమని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి లభించే అదనపు నిధులను కరోనా వల్ల నష్టపోయిన రంగాలకు కేటాయించాలని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది.