28న క్రెడాయ్‌ రియల్టీ పురస్కారాలు

20 Dec, 2019 01:23 IST|Sakshi

క్రిసిల్‌ సంస్థ ద్వారా ప్రాజెక్టుల పనితీరు పరిశీలన

హైదరాబాద్, సిటీ బ్యూరో: నిర్మాణ రంగంలో నాణ్యతతో పాటు వినియోగదారుడి భద్రతకు పెద్దపీట వేసిన డెవలపర్‌ను ప్రోత్సహించేందుకే పురస్కారాలను ఆరంభించినట్లు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) తెలంగాణ శాఖ ఛైర్మన్‌ గుమ్మి రామిరెడ్డి, అధ్యక్షుడు సీహెచ్‌ రామచంద్రారెడ్డి చెప్పారు. గురువారమిక్కడ విలేకరులతో వారు మాట్లాడారు.

ఈ నెల 28న క్రియేట్‌–2019 పేరిట హైదరాబాద్‌ ‘జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌’లో క్రెడాయ్‌ తెలంగాణ రియాల్టీ పురస్కారాలను అందజేయనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌ హాజరవుతారని, మొత్తం 13 విభాగాల్లో 103 నామినేషన్లు వచ్చాయని వారు తెలియజేశారు. రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ ద్వారా ఆయా ప్రాజెక్టుల లొకేషన్, గ్రీనరీ, నాణ్యత, వినియోగదారుడి భద్రతను పరిగణనలోకి తీసుకుని వాటి ఆధారంగా అవార్డులకు ఎంపిక జరుగుతుందని తెలియజేశారు.  

ఏపీలో 3 రాజధానులు సరైన నిర్ణయమే..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధానుల విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని క్రెడాయ్‌ సభ్యులు అభిప్రాయపడ్డారు. విలేకరులడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... అమరావతితో పాటు కర్నూలు, విశాఖలో రాజధానులు వస్తే మరింత పురోగతి సాధ్యపడుతుందన్నారు. సమావేశంలో క్రెడాయ్‌ కార్యదర్శి ప్రేమ్‌సాగర్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు కె.ఇంద్రసేనా రెడ్డి, జి.అజయ్‌కుమార్, కోశాధికారి బి.పాండు రంగారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు