రాజమండ్రి ప్లాంటు రుణాలు తీరుతాయా?

4 May, 2019 00:46 IST|Sakshi

జీఎంఆర్‌ గ్రూపు ప్రణాళికకు రుణదాతలు ఓకే

రూ.2,353 కోట్ల రుణంలో షేర్లుగా రూ.941 కోట్లు

ప్రిఫరెన్స్‌ షేర్ల రూపంలో రుణదాతలకు కేటాయింపు

మిగిలిన రూ.1,412 కోట్లను  20 ఏళ్లలో చెల్లించేలా ప్లాను  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రుణభారంతో కుంగిపోతున్న జీఎంఆర్‌ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్‌ (జీఆర్‌ఈఎల్‌), అప్పుల ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా వెల్లడించింది. ఈ ప్రణాళికకు కంపెనీ రుణదాతలు ఆమోదం తెలిపారని పేర్కొంది. జీఎంఆర్‌ రాజమండ్రి ఎనర్జీకి రూ.2,353 కోట్ల రుణ భారం ఉంది. తొలుత దీన్లో రూ.1,412 కోట్లను చెల్లించేందుకు ఒక విధానాన్ని రూపొందించారు. రూ. 1,412కోట్లలో 20% చెల్లించేందుకు, ఇంకా తొలి ఏడాది వడ్డీల కోసం జీఎంఆర్‌ గ్రూప్‌ రూ.395 కోట్లు కేటాయిస్తుంది. మిగిలిన రూ. 1,130 కోట్ల రుణాన్ని 9% ఫ్లోటింగ్‌ వడ్డీతో వచ్చే 20 ఏళ్లలో చెల్లించనుంది. మొత్తం రూ. 2353 కోట్లలో రూ. 1,412 కోట్లు పోగా మిగిలిన రూ. 941 కోట్ల రుణాన్ని  భవిష్యత్‌లో చెల్లుబడయ్యే సీఆర్‌పీఎస్‌గా (క్యుములేటివ్‌ రిడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లు) మార్చింది. ఈ షేర్లకు ఇప్పటినుంచి 17–20 ఏళ్ల మధ్య 0.1% వడ్డీతో చెల్లింపులు చేస్తారు.

ఈ ప్రణాళిక కంపెనీకి, రుణదాతలకు మేలు చేస్తుందని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ఎండీ గ్రంధి కిరణ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. తమ గ్రూప్‌ మొత్తం రుణాలు తగ్గేందుకు ఈ ప్రణాళిక ఉపకరిస్తుందన్నారు. రాజమండ్రి ప్లాంట్‌ పనిచేసేందుకు తగిన గ్యాస్‌ లభిస్తుందనే నమ్మకాన్ని జీఎంఆర్‌ వ్యక్తంచేస్తోంది. తద్వారా జీఆర్‌ఈఎల్‌ నిర్వహణ కొనసాగి సీఆర్‌పీఎస్‌లు డిఫాల్ట్‌ కాకుండా ఉంటాయని భావిస్తోంది. 2016లో జీఆర్‌ఈఎల్‌ వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణకు(ఎస్‌డీఆర్‌) వెళ్లింది. 2012లో ఈ ప్లాంట్‌ పూర్తయింది. కానీ గ్యాస్‌ సరఫరాలో కొరత కారణంగా కార్యకలాపాలు ఆలస్యమయ్యాయి. దీంతో వ్యయాలు పెరిగి రుణభారం ఎక్కువైంది. 2015లో సంస్థ కార్యకలాపాలు ఆరంభమయ్యాయి.    

మరిన్ని వార్తలు