ఎగవేత పట్టణాల్లోనే ఎక్కువ!

5 Jul, 2019 08:41 IST|Sakshi

సూక్ష్మ రుణాలపై సీఆర్‌ఐఎఫ్‌ హై మార్క్‌ నివేదిక

ముంబై: గ్రామీణ ప్రాంతాల్లోని రుణ గ్రహీతలతో పోలిస్తే, పట్టణాల్లోని సూక్ష్మ రుణ గ్రహీతల్లో సకాలంలో చెల్లించని ధోరణి ఎక్కువగా ఉందని క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ ‘సీఆర్‌ఐఎఫ్‌ హై మార్క్‌’ తెలిపింది. మార్చి త్రైమాసికం నాటికి పట్టణాల్లోని రుణగ్రహీతల్లో 30 రోజుల వరకు బకాయిలు చెల్లించని మొత్తం 3.25 శాతంగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది 2.5 శాతమే ఉందని వెల్లడించింది. ఇక తీసుకున్న రుణాలను 31 రోజుల నుంచి 180 రోజుల వరకు తీర్చకుండా బకాయి పడిన వారి శాతం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకే విధంగా ఉందని, 2018 సెప్టెంబర్‌ నుంచి ఒక శాతం మేర ఉన్నట్టు తెలిపింది. మొత్తం సూక్ష్మ రుణాలు రూ.1.88 లక్షల కోట్లలో గ్రామీణ ప్రాంత వాటా 54 శాతంగా ఉందని పేర్కొంది. మార్చి త్రైమాసికంలో స్థూల రుణాల పోర్ట్‌ఫోలియో 12 శాతం పెరిగిందని తెలిపింది. 2019 మార్చి నాటికి 5.6 కోట్ల యాక్టివ్‌ సూక్ష్మ రుణ గ్రహీతలు ఉన్నారని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 22 శాతం అధికమని వివరించింది. 

మరిన్ని వార్తలు