అవలీలగా అమ్మండిలా!

12 Apr, 2014 01:33 IST|Sakshi
అవలీలగా అమ్మండిలా!

 సాక్షి, హైదరాబాద్: కొనేటప్పుడు తక్కువ రేటులో కావాలి. అమ్మేటప్పుడు మాత్రం అధిక ధర రావాలని చాలామంది కోరుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో బూమ్ లేదు కాబట్టి.. మనం కోరుకున్న ధర రావడం కొద్దిగా కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంత నేర్పు అలవర్చుకోవడం ద్వారా ఎలాంటి సవాళ్లనైనా అధిగమించి స్థిరాస్తిని సులభంగా అమ్ముకోవచ్చు.

 కొనుగోలుదారులు ఏం కోరుకుంటున్నారో ముందుగా కనుక్కోవాలి. అంతేకాదు, స్థిరాస్తి మార్కెట్లో ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకోవాలి. సొంతిల్లు అనగానే చాలామందికి డాబా ఇల్లా? ఫ్లాటా? అనే సందేహం వస్తుంది. పాత, కొత్త ఇళ్లలో వేటిని కోరుకుంటున్నారు? లేదంటే ఇళ్ల స్థలాలనా? అన్న విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే అమ్మాలనుకునే ఆస్తికి మార్కెట్లో ఎలాంటి స్పందన ఉందో తెలుస్తుంది. ఇంత సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం బిల్డర్లకో, డెవలపర్లకో ఉంటుంది కానీ.. స్థలాన్నో, ఇంటినో అమ్ముకునే వారికెందుకన్న భావన చాలామందిలో కలుగుతుంది. కానీ మార్కెట్ గురించి తెలుసుకోవడం వల్ల వ్యక్తిగత ఆస్తులు అమ్మేవారికీ ఎంతగానో ఉపయోగం.


 మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కొన్ని అంశాలు స్థిరాస్తి ధరను ప్రభావితం చేస్తాయి. ఒక వేళ అవి ప్రతికూలంగా ఉన్నా వాటిని మెరుగుపర్చడానికి, మార్చడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకు స్థిరాస్తి ఏ ప్రాంతంలో ఉంది? ఇరుగు పొరుగు ఎవరుంటారు? వంటి విషయాలన్నమాట. స్థిరాస్తి మంచి ప్రాంతంలో ఉంటే పర్వాలేదు. ఇందుకు భిన్నంగా ఉంటే.. విక్రయానికి అనువైన పరిస్థితుల కోసం కసరత్తు చేయాల్సి ఉంటుంది. సరైన ధర చెప్పడం, ఆస్తికి సంబంధించిన పత్రాలన్నింటినీ పక్కాగా ఉంచుకోవడం, సరైన సమయంలో, సరైన కొనుగోలుదారుడిని పట్టుకోవడం వంటివన్నమాట.

అయితే ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయించలేవు. మార్కెట్ సెంటిమెంట్ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. గిరాకీ, సరఫరాలు కూడా కొంతమేరకు ప్రభావం చూపుతాయి. కాబట్టి స్థిరాస్తిని అమ్మాలనుకున ్నప్పుడు ముందుగా మార్కెట్ పరిస్థితుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ ఎలా ఉంది, ఆ ప్రాంతంలో సగటు ధర ఎంత? వంటి విషయాలపై దృష్టి పెట్టాలి.

 స్థిరాస్తికి ఏ చిన్నపాటి తేడా ఉన్నా కొనుగోలుదారులు ముందుకు రాకపోవచ్చు. అదే న్యాయపరమైన అంశం. మీరు విక్రయించాలని అనుకుంటున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారునికి స్పష్టంగా వివరించాలి. అతనికేమైనా సందేహాలుంటే ఓపిగ్తా నివృత్తి చేయాలి. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారుడు ముందడుగు వేస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు.

మరిన్ని వార్తలు