భారీగా తగ్గిన డేటా టారిఫ్స్‌

30 Mar, 2018 15:01 IST|Sakshi
మొబైల్‌ డేటా వాడకం (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : మొబైల్‌ ఇంటర్నెట్‌ రేట్లు భారీగా తగ్గాయి. గత మూడేళ్లలో మొబైల్‌ ఇంటర్నెట్‌ రేట్లు 93 శాతం మేర తగ్గినట్టు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం(డీవోటీ) రిపోర్టు చేసింది. ఇంటర్నెట్‌ రేట్లు భారీగా క్షీణించడంతో, ఈ మూడేళ్లలో డేటా వాడకం 25 సార్లకు పైగా పెరిగినట్టు తెలిపింది. అత్యంత చౌకైన టారిఫ్‌ గ్లోబలీ- 2014లో ఒక్కో జీబీకి 33 రూపాయలుంటే, 2017 సెప్టెంబర్‌లో ఒక్కో జీబీకి 21 రూపాయలుందని వెల్లడించింది. అంటే మొత్తంగా 93 శాతం వరకు టారిఫ్‌ తగ్గింపు ఉన్నట్టు డీవోటీ తెలిపింది. 2016లో రిలయన్స్‌ జియో మార్కెట్‌లోకి ఎంట్రీ అయ్యాక, టారిఫ్‌ రేట్ల తగ్గింపు మరింత ఉందని పేర్కొంది. ఈ కంపెనీ ఒక్కో జీబీని రోజుకు అత్యంత తక్కువగా 4 రూపాయలకే అందిస్తోంది. 

మొబైల్‌ ఇంటర్నెట్‌ రేట్లు తగ్గడంతో, డేటా వాడకం పలు సార్లు పెరిగినట్టు తెలిసింది. ఒక్కో సబ్‌స్క్రైబర్‌ సగటు డేటా వాడకం 25 సార్లు పెరిగిందని డీవోటీ ట్వీట్‌ చేసింది. అంటే 2014లో ఒక్కో నెలలో 62జీబీ వాడకముంటే, 2017లో ఒక్కో నెలలో 1.6జీబీ వాడకముందని తెలిపింది. కాగ, భారత్‌లో మొబైల్‌ డేటా వినియోగం ప్రపంచంలోనే అ‍త్యధికంగా ఒక్కో నెలలో 1.3 మిలియన్‌ జీబీ నమోదవుతున్నట్టు డీవోటీ పేర్కొంది. ఇది అమెరికా, చైనాలలో వాడే డేటా వాడకం కంటే అత్యధికం. మరోవైపు దేశంలో స్మార్ట్‌ఫోన్‌ వాడకం రెండింతలు పైగా పెరగడంతో(190 మిలియన్‌ నుంచి 390 మిలియన్లకు పెరగడంతో), ఇంటర్నెట్‌ యూజర్లు కూడా 66 శాతం పెరిగినట్టు డీవోటీ తెలిపింది. 2014-17 మధ్యకాలంలో ఇంటర్నెట్‌ యూజర్లు 251 మిలియన్ల నుంచి 429 మిలియన్లకు పెరిగినట్టు రిపోర్టు చేసింది. అటు బ్రాడ్‌బ్యాండ్‌ యాక్సస్‌ యూజర్లు కూడా 2014 మార్చిలో 61 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లుంటే, 2017 సెప్టెంబర్‌లో 325 మిలియన్ల సబ్‌స్క్రైబర్లకు పెరిగినట్టు వెల్లడించింది. ట్రాయ్‌ డేటా ప్రకారం 2017 డిసెంబర్‌ చివరి నాటికి ఇంటర్నెట్‌ సబ్‌స్క్రైబర్లు 445.9 మిలియన్లకు ఎగిసినట్టు తెలిసింది. 

మరిన్ని వార్తలు