బీమా పాలసీ క్లెయిమ్‌ కాలేదా? ఈ స్టోరీ చదవండి

19 Nov, 2019 13:24 IST|Sakshi

సాక్షి, ముంబై:  ఆపద సమయంలో ఆదుకుంటుందన్న భరోసాతో  బీమా (ప్రభుత్వ, లేదా ప్రైవేటు)  పాలసీ తీసుకునే  వినియోగదారులకు భారీ నిరాశ ఎదురయ్యే ఉదంతాలు చాలా చూశాం. ఇలాంటి ఘటనలో న్యాయ పోరాటం చేయడం కూడా చాలా అరుదు. కానీ ఒక పాలసీదారుని భార్య మాత్రం ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)పై పోరుకు దిగారు. చట్టపరంగా తనకు దక్కాల్సిన పాలసీ సొమ్ముపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)ను ఆశ‍్రయించి విజయం సాధించారు.  

వివరాల్లోకి వెళితే..ముంబైకి చెందిన దిగంబరరావు ఠాక్రే 2000 సంవత్సరంలో ఎల్‌ఐసీ నుంచి మూడు బీమా పాలసీలను తీసుకున్నారు. అనారోగ్యంతో మార్చి13, 2003న ఆయన కన్నుమూశారు. దీంతో ఆయన భార్య రత్న తనకు రావాల్సిన బీమా సొమ్మును చెల్లించాల్సిందిగా ఎల్‌ఐసీని కోరగా అందుకు ఆ సంస్థ తిరస్కరించింది. పాలసీ తీసుకునేముందు పాలసీదారుడు ఠాక్రే ఆస్తమాతో ఆసుపత్రిలో చేరడం తదితర విషయాలను దాచి పెట్టారని వాదించింది. దీంతో 2005లో ఆమె వార్ధాలోని జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. దీన్ని విచారించిన ఫోరమ్‌ ఆమె క్లెయిమ్‌ను చెల్లించాలని ఎల్‌ఐసీని ఆదేశించింది. 

ఇందుకు నిరకారించిన ఎల్‌ఐసీ ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఎన్‌సీడీఆర్‌సీలో రివ్యూ పిటిషన్‌ వేసింది. అయితే ఎల్‌ఐసీ వాదనను తిరస్కరించిన ఎన్‌సీడీఆర్‌సీ ఆమెకు రావాల్సిన రూ. 9.3 లక్షలు చెల్లించాలని తాజాగా ఆదేశించింది. ఎల్‌ఐసీ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవనీ, పైగా ఠాక్రేకు ఇంతకుముందు అలాంటి అనారోగ్యం ఉన్నప్పటికీ, ఎల్ఐసీ పాలసీ జారీ చేసే సమయానికి ఆరోగ్యంగా ఉన్నందున, ఆ కాంట్రాక్టును తొలగించలేమని ఎన్‌సీడీఆర్‌సీ ప్రిసైడింగ్ సభ్యుడు దీపా శర్మ వ్యాఖ్యానించారు. వినియోగదారుని అభ్యర్థనను బీమా సంస్థ తిరస్కరించడం సేవలో లోపంగానే పరిగణించాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు