మార్చి క్వార్టర్లో భారీగా పెరిగిన డీఐఐల పెట్టుబడులు

3 Jun, 2020 13:38 IST|Sakshi

 ఈక్విటీల్లో రికార్డు స్థాయికి డీఐఐల హోల్డింగ్‌ 

మార్చి త్రైమాసికంలో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులతో కొంతమేర భర్తీ అయ్యాయి. ఈ త్రైమాసికంలో భారత ఈక్విటీలలో డీఐఐల హోల్డింగ్‌ రికార్డు స్థాయిలో 14.8 శాతానికి చేరినట్లు యాక్సిస్‌ క్యాపిటల్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఈ జనవరి నుంచి స్థానిక పెన్షన్ ఫండ్స్, బ్యాంకుల ట్రెజరీ నిర్వహణ ఆస్తులు వరుసగా 20 శాతం, 47 శాతం పెరిగాయి. ఈ గణాంకాలు పరిశీలిస్తే స్టాక్‌ మార్కెట్లోకి దేశీయ ప్రవాహాల పెరిగినట్లు తెలుస్తోంది. భారత ఈక్విటీ మార్కెట్లో స్థానిక మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, స్థానిక పెన్షన్ ఫండ్స్, బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు డీఐఐగా ఉన్నాయి. 

ఈ ఏడాది ఏప్రిల్‌ 2020 నాటికి డీఐఐ ఏయూఎం రూ.20.4లక్షల కోట్లు ఉండగా, ఎఫ్‌ఐఐల ఏయూఎం రూ.24.4లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి ఈక్విటీ మార్కెట్లో డీఐఐలు రూ.72వేల కోట్లు పెట్టుబడులు పెట్టారు. అయితే ఎఫ్‌ఐఐలు రూ.39వేల కోట్లు ఉపసంహరించుకున్నారు. 

బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌లో మొత్తం కంపెనీల ఫ్రీ- ఫ్లోట్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో డీఐఐల హోల్డింగ్‌ మూడో వంతుకి చేరుకుంది. ఇదే ఇండెక్స్‌లో మార్చి క్వార్టర్లో  దేశీయ ఇన్వెస్టర్లు సమారు 106 కంపెనీల్లో 1శాతానికి పైగా వాటాను పెంచుకున్నారు. 42 కంపెనీల్లో 1శాతం వాటాను తగ్గించుకున్నారు. ఇక ఎఫ్‌ఐఐ హోల్డింగ్‌ విషయానికొస్తే.. ఇదే ఇండెక్స్‌లో వారి వాటా 70బేసిస్‌ పాయింట్లు తగ్గి 21.5శాతానికి చేరుకుంది. వారు నిఫ్టీ-50 కంపెనీల్లో 27 కంపెనీల్లో తమ వాటాను తగ్గించుకున్నారు. 

ఇదే మార్చి క్వార్టర్లో డీఐఐలు పవర్‌గ్రిడ్‌ కార్పోరేషన్‌, ఐషర్‌మోటర్స్‌, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ తదితర లార్జ్‌ కంపెనీలకు చెందిన సుమారు రూ.15వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.
 

>
మరిన్ని వార్తలు