ఆయిల్‌–గ్యాస్‌ రెగ్యులేటర్‌ చీఫ్‌గా దినేశ్‌ కె సరాఫ్‌

5 Dec, 2017 00:19 IST|Sakshi

న్యూఢిల్లీ: పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటర్‌ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) కొత్త చైర్మన్‌గా దినేశ్‌ కె సరాఫ్‌ నియమితులయ్యారు. ఈయన ఓఎన్‌జీసీ మాజీ సీఎండీ. 2015 ఆగస్ట్‌లో ఎస్‌.కృష్ణన్‌ పదవీ విరమణతో పీఎన్‌జీఆర్‌బీ చీఫ్‌ పదవి ఖాళీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు దినేశ్‌ సరాఫ్‌ను కొత్త చీఫ్‌గా నియమించింది.   

సైకిల్‌ షేరింగ్‌ సర్వీసులొస్తున్నాయ్‌!
న్యూఢిల్లీ: మొబైల్‌ వాలెట్‌ సంస్థ ‘మొబిక్విక్‌’ మాజీ మార్కెటింగ్‌ హెడ్‌ ఆకాశ్‌ గుప్తా... దేశంలో బైసైకిల్‌ షేరింగ్‌ సర్వీస్‌లను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక వారంలోగా ‘మాబ్‌సీ’ యాప్‌ను ఆవిష్కరించనున్నారు. ‘మెట్రో, బస్సు దిగిన తర్వాత డ్రాప్‌ పాయింట్ల వద్ద పార్క్‌ చేసిన బైసైకిల్స్‌ ఉంటాయి. దానిపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను యాప్‌ సాయంతో స్కాన్‌ చేస్తే అది అన్‌లాక్‌ అవుతుంది. తీసుకొని గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. తర్వాత పబ్లిక్‌ పార్కింగ్‌ ప్రాంతాల్లో పార్క్‌ చేసి లాక్‌ చేయాలి. అప్పుడు రైడ్‌ పూర్తవుతుంది’ అని గుప్తా వివరించారు.

‘సబ్‌స్క్రిప్షన్‌ పద్ధతిలో సేవలు అందుబాటులో ఉంటాయి. నెలకు రూ.99లతో 60 రైడ్‌లు పొందొచ్చు. సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.999. ఇది సాధారణ ప్రజలకు. ఇక విద్యార్ధుల విషయానికి వస్తే రోజుకు 4 రైడ్లు ఉంటాయి. నెల ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్‌ మామూలే. అదే రైడ్‌ టైమ్‌ గంట దాటితే అదనపు చార్జీలుంటాయి’ అని వివరించారు.   

మరిన్ని వార్తలు