డీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ బాధ్యతలకు సింగ్‌ వీడ్కోలు

5 Jun, 2020 06:26 IST|Sakshi

కుమారుడు రాజీవ్‌కు చైర్మన్‌ పగ్గాలు

న్యూఢిల్లీ: ఓ సాధారణ రియల్టీ కంపెనీని దేశంలోనే దిగ్గజ సంస్థగా నిలిపిన డీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ కుషాల్‌పాల్‌ సింగ్‌ గురువారం తన పదవీ బాధ్యతలకు విరమణ చెప్పారు. 90 ఏళ్ల సింగ్‌ 60 ఏళ్ల పాటు డీఎల్‌ఎఫ్‌ కోసమే కష్టపడ్డారు. ఢిల్లీ ల్యాండ్‌ అండ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీఎల్‌ఎఫ్‌) అనే కంపెనీని 1946లో కుషాల్‌పాల్‌ సింగ్‌ మామయ్య స్థాపించారు. 1961లో ఆర్మీలో ఉద్యోగ బాధ్యతలకు స్వస్తి చెప్పిన కుషాల్‌పాల్‌ సింగ్‌ డీఎల్‌ఎఫ్‌లో చేరి కంపెనీ భవిష్యత్తును కొత్తపుంతలు తొక్కించారు. గురువారం జరిగిన డీఎల్‌ఎఫ్‌ బోర్డు సమావేశంలో.. కుషాల్‌పాల్‌ సింగ్‌ను గౌరవ చైర్మన్‌గా, ఆయన కుమారుడు రాజీవ్‌ను నూతన చైర్మన్‌గా నియమిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.

గురుగ్రామ్‌ అభివృద్ధికి ఆద్యుడు: దేశంలో గురుగ్రామ్‌ ప్రముఖ పట్టణమని తెలిసిందే. ఢిల్లీకి సమీపంలోనే ఉండే ఈ ప్రాంతానికి చక్కని భవిష్యత్తు ఉందని కుషాల్‌పాల్‌సింగ్‌ 1979లోనే ప్రణాళికలు వేసుకున్నారు. అప్పట్లో చిన్న గ్రామంగా ఉన్న గురుగ్రామ్‌ను సింగపూర్‌ మాదిరిగా ఢిల్లీకి శాటిలైట్‌ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేసి అంతర్జాతీయ కంపెనీలను రప్పించాలన్న ప్రణాళిక ఆయనకు ఉండేది. కానీ, దురదృష్టవశాత్తూ దీన్ని సాకారం చేయలేకపోయినట్టు సింగ్‌ ఓ వార్తా సంస్థతో చెప్పారు. తాను ఊహించినట్టుగా గురుగ్రామ్‌ను అభివృద్ధి చేయలేకపోయినట్టు పేర్కొన్నారు.

డీఎల్‌ఎఫ్‌ నష్టాలు రూ.1,857 కోట్లు
డీఎల్‌ఎఫ్‌కు గత ఆర్థిక సంవత్సరం (2019–20) మార్చి క్వార్టర్లో రూ.1,858 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. డిఫర్డ్‌ ట్యాక్స్‌ అసెట్స్‌ (డీటీఏ) రివర్సల్‌ కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్‌లో రూ.437 కోట్ల నికర లాభం వచ్చిందని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. మొత్తం  ఆదాయం రూ.2,661 కోట్ల నుంచి రూ.1,874 కోట్లకు తగ్గిందని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో రూ.1,319 కోట్ల నికర లాభం రాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.583 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,029 కోట్ల నుంచి రూ.6,884 కోట్లకు తగ్గిందని పేర్కొంది.

మరిన్ని వార్తలు