ఎస్‌బీఐలో విలీనమైన  బ్యాంకుల్లో మీకు చెక్‌బుక్‌ ఉందా?

28 Dec, 2017 00:13 IST|Sakshi

జనవరి 1 నుంచీ అది చెల్లదు

కొత్త చెక్‌బుక్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిందే  

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో (ఎస్‌బీఐ) ఇటీవల విలీనమైన ఆరు బ్యాంకుల్లో ఏదైనా బ్యాంక్‌లో మీకు చెక్‌ బుక్‌ ఉందా? అయితే ఆ చెక్‌ బుక్‌లకు తుది గడువు డిసెంబర్‌ 31. జనవరి 1వ తేదీ నుంచీ ఆ చెక్కులను గనక జారీ చేస్తే అవి చెల్లవు. అటు తర్వాత తేదీతో జారీ అయ్యే చెక్కులు తప్పనిసరిగా ఎస్‌బీఐ నుంచి పొందినవై ఉండాలి. నిజానికి ఈ గడువు సెప్టెంబర్‌ 30తోనే ముగిసింది. కస్టమర్ల సౌలభ్యం నిమిత్తం దీన్ని ఈ నెలాఖరు వరకూ పొడిగించారు.

ఐదు అనుబంధ బ్యాంకులు– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ రాయ్‌పూర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్, భారతీయ మహిళా బ్యాంకు ఎస్‌బీఐలో పూర్తిస్థాయిలో విలీనమైన సంగతి తెలిసిందే. విలీనమైన బ్యాంకుల కస్టమర్లు కొత్త చెక్‌బుక్‌ కోసం ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్, ఏటీఎం లేదా కస్టమర్‌ స్వయంగా తన సొంత బ్యాంక్‌ బ్రాంచీకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.  

>
మరిన్ని వార్తలు