రైల్వే ప్రయాణికులు, ఇక విమానంలో జర్నీ

23 Oct, 2017 17:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో టిక్కెట్‌ కన్‌ఫామ్‌ కాలేదా? ప్రయాణం ఎలా చేయాలి అని ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ ఆందోళనేమీ అవసరం లేదట. టిక్కెట్‌ కన్‌ఫామ్‌ కాని రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అన్‌కన్‌ఫామ్‌గా ఉన్న ఏసీ టిక్కెట్‌ ప్రయాణికులు త్వరలో విమానంలో ప్రయాణించవచ్చట. ఏసీ-1, ఏసీ-2 టిక్కెట్‌ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలుస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఏసీ-2 ధరలు విమాన టిక్కెట్‌ ధరలకు ఎక్కువగానే లేదా దానికి కొంచెం దగ్గరగాను ఉంటాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఎంత అడ్వాన్స్‌గా టిక్కెట్లు బుక్‌ చేసుకున్నప్పటికీ, చాలా మంది ప్రయాణికులు వేయిటింగ్‌ లిస్టులోనే ఉంటాయి. అంటే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు అంత డిమాండ్‌ అన్నమాట. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఏసీ టిక్కెట్‌ ప్రయాణికులకు ఎయిర్‌ ఇండియాలో ప్రయాణానికి అవకాశం కల్పించాలని రైల్వే ప్లాన్‌ వేస్తోంది. 

ప్రస్తుతం రైల్వే బోర్డు చైర్మన్‌గా ఉన్న అశ్వని లోహాని, ఎయిరిండియాకు చైర్మన్‌గా ఉన్నప్పుడే ఈ ప్లాన్‌ను సిద్ధం చేశారు. అయితే అప్పట్లో రైల్వే అంత సానుకూలంగా స్పందించలేదు. ప్రస్తుతం రైల్వే బోర్డుకు ఆయనే చైర్మన్‌గా ఉండటంతో, ఒకవేళ ఎయిరిండియా ఈ ప్లాన్‌పై రైల్వేను ఆశ్రయిస్తే, వెంటనే ఆమోదం లభ్యమయ్యేటట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 23న లోహాని రైల్వే బోర్డుకు చైర్మన్‌గా ఎంపికయ్యారు. లోహాని ప్లాన్‌ ప్రకారం కన్‌ఫామ్‌ కాని టిక్కెట్‌ ప్రయాణికుల వివరాలు, ఎయిరిండియాతో షేర్‌ చేస్తారు. అదే మార్గానికి విమానంలో టిక్కెట్లుంటే వారికి, వాటిని ఆఫర్‌ చేస్తారు. లోహాని తొలుత ఈ ప్లాన్‌ను సిద్ధం చేసినప్పుడు, ఢిల్లీ-ముంబై లాంటి పలు ముఖ్యమైన మెట్రో రూట్ల ఏసీ-2 టిక్కెట్లకు విమాన టిక్కెట్లను ఆఫర్‌ చేయాలని ఎయిరిండియా నిర్ణయించింది.

మరిన్ని వార్తలు