-

బడ్జెట్‌ షాక్‌ : భారీగా ఎగిసిన పుత్తడి

5 Jul, 2019 14:57 IST|Sakshi

సాక్షి, ముంబై : బులియన్‌ మార్కెట్‌కు బడ్జెట్‌ షాక్‌  తగిలింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విలువైన లోహాలపై సుంకాన్ని పెంచడంతో ధరలు  అమాంతం పుంజుకున్నాయి.  దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం భారీగా పుంజుకుంది. దేశీయ బంగారు ఫ్యూచర్స్  మార్కెట్‌లో 2 శాతానికి పైగా ర్యాలీ అయ్యాయి. పది గ్రాముల  బంగారం ధర రూ. 712  ఎగిసి రూ. 34929 వద్ద కొనసాగుతోంది.   రాజధాని  నగరం ఢిల్లీలో 99.9 స్వచ్ఛతగల బంగారం ధర  10 గ్రా. 590 రూపాయలు పెరిగి రూ. 34,800గా ఉంది.  8 ఎనిమిది గ్రాముల  సావరిన్‌ గోల్డ్‌ కూడా 200 ఎగిసి రూ.27వేలు పలుకుతోంది.

మరో విలువైన మెటల్‌ వెండి కూడా ఇదే బాటలో ఉంది.  ఫ్యూచర్స్‌లో కిలో వెండి ధర 633 రూపాయలు ఎగిసి 38410 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం  ఔన్స్‌  ధర 1,415 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. అమెరికా  జాబ్‌డేటా, వడ్డీరేటుపై ఫెడ్‌ ప్రకటన తదితర అంశాల నేపథ్యంలో ఈ వారంలో ధరలు 2 శాతానికి పైగా పెరిగిన పుత్తడి వరుసగా ఏడవ వారం కూడా లాభాల  పరుగుతీస్తోంది. 

మరోవైపు దిగుమతి సుంకం పెంపువార్తలతో  జ్యుయల్లరీ షేర్లు 2-7శాతం పతనమయ్యాయి.  టైటాన్ కంపెనీ 3.1 శాతం, గోల్డియం ఇంటర్నేషనల్ 6.7 శాతం, లిప్సా జెమ్స్ 3 శాతం, పీసీ జ్యుయలర్‌ 4.84 శాతం, రినయిన్స్‌ జ్యుయల్లరీ 2 శాతం, తంగమాయి జ్యువెలరీ 5.8 శాతం, త్రిభువన్‌ దాస్ భీంజీ జవేరి 6.4 శాతం  నష్టపోతున్నాయి. కాగా  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో బంగారం , ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని 12.5శాతానికి  పెంచుతున్నట్టు ప్రకటించారు.  ప్రస్తుతమున్న 10 శాతం నుంచి బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 12.5 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

చదవండి :  ఆదాయ పన్ను రిటర్న్స్‌ : ఊరట

మరిన్ని వార్తలు