ఐఫోన్ ఎస్ఈ కొనే వాళ్లు ఆగండి..

9 Apr, 2016 13:27 IST|Sakshi

యాపిల్ తాజాగా ఆవిష్కరించిన ఐఫోన్ ఎస్ఈ కొనాలనుకుంటున్నారా? అయితే కొన్ని నెలలు ఆగాల్సిందే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఎందుకంటే ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గుతుందంట. ప్ర్తస్తుతం భారత మార్కెట్లో రూ.39 వేలుగా ఉన్న దీని ధర రూ. 30 వేలకు పడిపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేట్టు ఈ ఫోన్ ధర తగ్గించనున్నట్టు తెలుస్తోంది.

ఐఫోన్ 5ఎస్ భారత్ మార్కెట్లో మంచి డిమాండ్ పలకడం, ఐఫోన్ ఎస్ఈకి ధర తగ్గుదలకు ఆటంకంగా మారింది. 2015 చివరి క్వార్టర్ లో ఈ ఐఫోన్ 5ఎస్ లను కంపెనీ ఎక్కువగా దిగుమతి చేసుకుంది. ఈ స్టాక్ అమ్ముడుపోయే వరకు ఐఫోన్ ఎస్ఈ ధర రూ.39 వేలగానే ఉంచేందుకు కంపెనీ నిర్ణయించింది. ఒకవేళ ఇప్పుడే ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గిస్తే 5ఎస్ అమ్మకాలు పడిపోయే అవకాశాలు ఉండటంతో, ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గింపుకు మరికొన్ని నెలలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాని కొన్ని నెలల్లోనే యాపిల్ కచ్చితంగా ఐఫోన్ ఎస్ఈ ధరను తగ్గిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

అదేవిధంగా క్యాష్ బ్యాక్, ఈఎంఐ ఆఫర్లను కూడా ఐఫోన్ ఎస్ఈకి యాపిల్ కల్పించనుంది. ఐఫోన్ ఎస్ఈకు ముందు మార్కెట్లోకి వచ్చిన 16జీబీ ఐఫోన్ 6ఎస్ ధర కూడా కొన్ని నెలల్లోనే రూ.62 వేల నుంచి రూ.42 లకు పడిపోయింది. ఇదే విధంగా కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన ఐఫోన్ ఎస్ఈ ధరను కూడా యాపిల్ తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ 6ఎస్ కు, ఎస్ఈకి పెద్ద తేడాలు ఏమీ లేవని, ఒకే విధమైన ఫీచర్స్ ను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయంటున్నారు.

మరిన్ని వార్తలు