మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌

21 Mar, 2018 19:54 IST|Sakshi

న్యూఢిల్లీ : మొబైల్‌ యూజర్లకు టెలికాం డిపార్ట్‌మెంట్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆధార్‌తో మొబైల్‌ నెంబర్ల రీ-వెరిఫికేషన్‌ ప్రక్రియ గడువును టెలికాం డిపార్ట్‌మెంట్‌ పొడిగించినట్టు ప్రకటించింది. ఆధార్‌ వాలిడిటీపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు ఈ వెరిఫికేషన్‌ చేపట్టుకోవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ప్రస్తుత మొబైల్‌ సబ్‌స్క్రైబర్లు ఆధార్‌ ఆధారితంగా జరిపే ఈ-కేవైసీ  ప్ర​క్రియను, సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు పెంచుకోవచ్చని వెల్లడించింది. అదేవిధంగా ప్రస్తుతం టెలికాం కంపెనీలు పంపుతున్న వాయిస్‌, టెక్ట్స్‌ మెసేజ్‌లలో రీ-వెరిఫికేషన్‌ ప్రక్రియ చివరి తేదీని పేర్కొనకూడదని ఆదేశాలు జారీచేసింది. పలు సర్వీసులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తప్పనిసరి చేస్తున్న ఆధార్‌ లింకేజీపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. మార్చి 13న జరిపిన విచారణలో ఆధార్‌ డెడ్‌లైన్‌ను మార్చి 31 కాకుండా, రాజ్యాంగ బెంచ్‌ తుది తీర్పు వెల్లడించే వరకు పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఈ ఏడాది జనవరి 1 నుంచి టెలికాం డిపార్ట్‌మెంట్‌, ఆటోమేటెడ్‌ కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ 14546 ద్వారా అన్ని ఆపరేటర్లు మొబైల్‌ నెంబర్ల రీ-వెరిఫికేషన్‌ను చేపట్టేలా వీలు కల్పించింది. తొలుత దీని ద్వారా జరిగే ప్రక్రియకు ఫిబ్రవరి 6ను డెడ్‌లైన్‌గా విధించి, అనంతరం మార్చి 31కి మార్చింది. ప్రస్తుతం ఈ ప్రక్రియను సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు చేపట్టవచ్చని టెలికాం డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. ఓటీపీ, ఫింగర్‌ప్రింట్‌ అథెంటికేషన్‌ ఇవ్వలేని కస్టమర్లకు వారి ఇంటి వద్దే మొబైల్‌ నెంబర్‌ రీ-వెరిఫికేషన్‌ చేపట్టేందుకు డీఓటీ గత అక్టోబర్‌లో అనుమతి ఇచ్చింది.  ఆధార్‌ లేని విదేశీయులు ఈ ప్రక్రియను వారు తమ మొబైల్‌ నెంబర్‌ ఆపరేటర్‌ రిటైల్‌ అవుట్‌లెట్‌కు వెళ్లి, పాస్‌పోర్టు వివరాలు అందించి చేపట్టాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు