సిప్‌ రెట్టింపు చేసుకోండి!

29 May, 2020 15:18 IST|Sakshi

ప్రశాంత్‌ జైన్‌ సలహా

ప్రస్తుత ఎకానమీ లేదా మార్కెట్‌ ప్రదర్శనను చూసి ఒక అంచనాకు రావద్దని, ప్రస్తుత వెనుకంజ నిజానికి పెట్టుబడులకు సరైన అవకాశమని ప్రముఖ అనలిస్టు ప్రశాంత్‌ జైన్‌ సూచిస్తున్నారు. 2020-21ని మర్చిపోయి తర్వాత సంవత్సరాలను మదింపు చేసుకోవాలన్నారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో సిప్‌ పెట్టుబడులు డబుల్‌ చేసుకోవడం ద్వారా మంచి ఆర్జన చూడొచ్చన్నారు. కరోనా సంక్షోభం కారణంగా జీడీపీ కుంచించుకుపోవడం సహజమేనని చెప్పారు. ఈ ఇబ్బంది కారణంగా కార్పొరేట్‌ లాభదాయకత బాగా దెబ్బతింటుందన్నారు. అయితే ఇదంతా సంక్షోభానంతరం కుదుటపడుతుందని, నిజానికి వర్ధమాన మార్కెట్లన్నింటిలో భారత్‌ది భిన్నగాధని చెప్పారు. శుక్రవారం దేశీయ జీడీపీ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ దఫా సహజంగానే జీడీపీ బాగా మందగించిఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సహా పలు బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. అయితే కరోనా కారణంగా ఎగుమతులు, దిగుమతులు క్షీణించి తొలిసారి 10-12 సంవత్సరాల తర్వాత చెల్లింపుల శేషం(బాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌) పాజిటివ్‌గా ఉంటుందని జైన్‌ అంచనా వేశారు. రాబోయే రోజుల్లో వడ్డీరేట్లు మరింత దిగివస్తాయన్నారు. 2021-22లో తిరిగి ఇండియా రెండంకెల వృద్ది సాధిస్తుదని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్లో వినిమయ రంగ స్టాకులపై పాజిటివ్‌గా లేనని, లాక్‌డౌన్‌ కారణంగా వినిమయం తగ్గిందని, ఈ నేపథ్యంలో వినిమయ స్టాకుల వాల్యూషన్లు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఆస్తుల నాణ్యత పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుంటే తిరిగి బ్యాంకింగ్‌ రంగం పుంజుకుంటుందన్నారు. 

మరిన్ని వార్తలు