పెట్టుబడి నిర్ణయాల్లో మహిళల పాత్ర పరిమితమే

31 May, 2019 08:21 IST|Sakshi

పురుషులతో పోలిస్తే సగం మందే సొంత నిర్ణయాలు

డీఎస్‌పీ విన్‌వెస్టర్‌ పల్స్‌ సర్వే

న్యూఢిల్లీ: పురుషులతో సమానంగా తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటున్న వనితలు... స్వతంత్ర పెట్టుబడి నిర్ణయాల విషయంలో మాత్రం కాస్త దూరంగానే ఉంటున్నారు. 64 శాతం మంది మగవారు పెట్టుబడులపై నిర్ణయాలు సొంతంగా తీసుకుంటుంటే, మహిళలు మాత్రం 33 శాతం మందే స్వీయ నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. డీఎస్‌పీ విన్‌వెస్టర్‌ పల్స్‌ 2019 సర్వే ద్వారా ఈ విషయాలు తెలిశాయి. ‘‘పెట్టుబడి విభాగంలో రిటైల్‌ ఇన్వెస్టర్లుగా మహిళలను పెద్ద ఎత్తున విస్తరిస్తున్నారు. పారిశ్రామిక పనివారిలో ఎక్కువ భాగం మహిళలే ఉన్నా, సీనియర్‌ స్థాయి నిపుణులు, ఫండ్‌ మేనేజర్లలోనూ మహిళలు ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉంది’’ అని డీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ప్రెసిడెంట్‌ కల్పేన్‌ పారిక్‌ తెలిపారు.

ఇక స్వీయ పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే 33 శాతం మంది మగువల వెనుక వారి జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రధానంగా ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది. తమ భర్తలు మరణించడం లేదా విడాకుల వల్ల తాము సొంతంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని 13 శాతం మంది మహిళలు చెప్పడం గమనార్హం. 30 శాతం మంతి తాము సొంతంగా పెట్టుబడికి సంబంధించి నిర్ణయాలు తీసుకోగలమని చెప్పారు. ఇకతమ పిల్ల విద్య, సొంతిల్లు, పిల్లల వివాహాలు, అప్పుల్లేని జీవితం, ఉన్నత ప్రమాణాలతో జీవించడం అనే ముఖ్యమైన లక్ష్యాల విషయంలో స్త్రీ, పురుషులు సరిసమానంగానే ఉన్నట్టు డీఎస్‌పీ సర్వే తెలిపింది. ఇన్వెస్ట్‌మెంట్‌ లేదా కారు లేదా ఇల్లు కొనుగోళ్ల నిర్ణయాల్లో పురుషుల ఆధిపత్యం ఉంటుంటే, బంగారం/ఆభరణాలు, రోజువారీ ఇంటి ఖర్చులు విషయంలో మహిళల పాత్ర కీలకంగా ఉంది. దేశవ్యాప్తంగా 8 పట్టణాల్లో 4,013 మంది మహిళల నుంచి అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు