ఎఫ్‌పీఐలకు సులభ కేవైసీ

6 Jul, 2019 13:01 IST|Sakshi

సామాజిక సంస్థలు, స్వచ్చంద సంస్థలకు నిధుల సమీకరణ అవకాశం...!

క్యాపిటల్‌ మార్కెట్లను ప్రజలకు మరింత చేరువ చేసే చర్యలు నిర్మలాసీతారామన్  బడ్జెట్లో కనిపించాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) సంబంధించి కేవైసీ నిబంధనల సడలింపు, సామాజిక, స్వచ్చంద సంస్థల లిస్టింగ్‌కు వీలుకల్పించే విధంగా సోషల్‌ స్టాక్‌ ఎక్సే ్చంజ్‌ ఏర్పాటు, లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రజల కనీస వాటా 25 శాతం నుంచి 35 శాతానికి పెంపు ప్రతిపాదనలు బడ్జెట్లో చోటు చేసుకున్నాయి. క్యాపిటల్‌ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యాన్ని పెంచే చర్యలు కనిపించాయి.

కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు ఆర్‌బీఐ, సెబీతో సంప్రదింపుల అనంతరం మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. సామరస్య, సమస్యల్లేని పెట్టుబడుల వాతావరణాన్ని ఎఫ్‌పీఐలకు కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అందుకే వారికి సంబంధించి కేవైసీ (మీ క్లయింట్‌ ఎవరన్నది తెలుసుకునే వివరాలు) నిబంధనలను క్రమబద్ధీకరించడం, సులభతరం చేయడం ద్వారా... సమగ్ర, సీమాంతర పెట్టుబడుల విషయంలో రాజీ పడకుండా మరింత పెట్టుబడి అనుకూలంగా మార్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. స్టాక్‌ మార్కెట్లో అడ్డంకుల్లేని పెట్టుబడులకు గాను ఎన్ఆర్‌ఐ పోర్ట్‌ఫోలియో మార్గాన్ని కూడా ఎఫ్‌పీఐల మార్గంలో విలీనం చేయాలని మంత్రి ప్రతిపాదించారు. డెట్‌ సెక్యూరిటీల్లో ఎఫ్‌ఐఐలు, ఎఫ్‌పీఐల పెట్టుబడులను దేశీయ ఇన్వెస్టర్లకు బదలాయించడం, విక్రయించడం, అలాగే,     ఎన్‌బీఎఫ్‌సీలు జారీ చేసే డెట్‌ సెక్యూరిటీల్లో ఎఫ్‌పీఐల ప్రవేశానికి మంత్రి ప్రతిపాదించారు.

మరిన్ని వార్తలు