ఈసీబీ తాజా ఉద్దీపన

13 Sep, 2019 11:06 IST|Sakshi

22 బిలియన్‌ డాలర్ల విలువైన బాండ్ల కొనుగోలు

రివర్స్‌ డిపాజిట్‌ రేట్లు మరింత కిందకు

లండన్‌: ఆర్ధిక పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) మరో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించింది. దీనిప్రకారం, నెలకు 20 బిలియన్‌ యూరోల (22 బిలియన్ల అమెరికా డాలర్లు) విలువైన బాండ్లను వ్యవస్థ నుంచి కొనుగోలు చేయనుంది. దీనితో ఆరి్థక వ్యవస్థలోకి ఈ మొత్తం వచ్చి, ఆరి్థక వృద్ధికి దోహదపడుతుందన్నది సిద్ధాంతం. ఇక ఇదే దిశలో వడ్డీరేట్లనూ మరింత మైనస్‌లోకి పంపింది. బ్యాంకింగ్‌ వడ్డీరేట్లు ప్రస్తుతం మైనస్‌ 0.4 శాతం ఉంటే, దీనిని మరింతగా మైనస్‌ 0.5 శాతానికి తగ్గించింది. దీనివల్ల బ్యాంకులో డిపాజిట్లు వేస్తే, రివర్స్‌ వడ్డీరేట్లు మరింతగా కట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భంలో బ్యాంకులో డిపాజిట్లు తగ్గి ఆ మేరకు మొత్తాలు ఆర్థిక ఉద్దీపనకు దోహదపడతాయని అంచనా. వచ్చే వారం అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ కూడా వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న వార్తల నేపథ్యంలో యూరోజోన్‌లో తాజా ఉద్దీపన చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా వడ్డీరేట్లు తగ్గిస్తే, ఇది ఈ ఏడాది రెండవసారి అవుతుంది. ప్రపంచ వృద్ధి తగ్గుతుందన్న వార్తల నేపథ్యంలో పలు దేశాలు సరళతర ఆరి్థక విధానాలవైపు మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు