మెడికల్‌ టూరిజంతో ఎకానమీకి ఊతం..

2 Jan, 2020 07:59 IST|Sakshi

‘అపోలో హాస్పిటల్స్‌’ సంగీతా రెడ్డి

న్యూఢిల్లీ: భవిష్యత్‌లో అందుబాటు ధరల్లో వైద్య సేవలందించే మెడికల్‌ టూరిజం కేంద్రంగా భారత్‌ ఎదగనుందని, దేశ ఎకానమీకి ఈ విభాగం తోడ్పాటు గణనీయంగా ఉండబోతోందని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతా రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో తమ పోర్ట్‌ఫోలియోలో ఇది కూడా కీలకం కానుందని ఆమె తెలిపారు. శరవేగంగా వృద్ధి చెందుతున్న ఈ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రత్యేకంగా అంతర్జాతీయ పేషంట్ల విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో దీని ద్వారా దాదాపు 2 లక్షల మంది రోగులకు చికిత్స అందించినట్లు వివరించారు. ఎక్కువ మంది ప్రధానంగా క్యాన్సర్, అవయవ మార్పిడి, ఆర్థోపెడిక్స్, న్యూరోసర్జరీ, హృద్రోగాలు మొదలైన సమస్యల చికిత్స కోసం వస్తున్న వారు ఉంటున్నారని సంగీతా రెడ్డి చెప్పారు. ముఖ్యంగా నేపాల్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాక్, కెన్యా, నైజీరియా, ఇథియోపియా, ఒమన్, యెమెన్, ఉజ్బెకిస్తాన్, మయన్మార్‌ తదితర దేశాల నుంచి అంతర్జాతీయ పేషంట్లు వస్తున్నారని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు