బ్యాంక్‌ స్కామ్‌ : రూ 637 కోట్ల నీరవ్‌ ఆస్తులు అటాచ్‌

1 Oct, 2018 11:43 IST|Sakshi
పీఎన్‌బీ స్కామ్‌ నిందితుడు నీరవ్‌ మోదీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ స్కామ్‌కు సంబంధించి బిలియనీర్‌ జ్యూవెలర్‌ నీరవ్‌ మోదీ, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ 637 కోట్ల విలువైన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను ఈడీ అటాచ్‌ చేసింది. భారత్‌తో పాటు పలు దేశాల్లో విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిందని దర్యాప్తు సంస్ధ అధికారి ఒకరు వెల్లడించారు.

న్యూయార్క్‌లో నీరవ్‌ మోదీకి చెందిన రూ 216 కోట్ల విలువైన రెండు స్ధిరాస్తులను కూడా మనీల్యాండరింగ్‌ నియంత్రణ చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అటాచ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. వీటితో పాటు రూ 278 కోట్ల నిల్వలున్న నీరవ్‌కు చెందిన రెండు విదేశీ బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు. రూ 22.69 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన ఆభరణాలను హాంకాంగ్‌ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు.

దక్షిణ ముంబైలో రూ 19.5 కోట్ల విలువైన ఫ్లాట్‌ను అటాచ్‌ చేశారు. మరోవైపు నీరవ్‌ మోదీ ఉదంతంతో పాటు పలు కుంభకోణాల్లో ప్రమేయం ఉన్న ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముక్‌ అథియాను ప్రాసిక్యూట్‌ చేయాలని సీనియర్‌ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి లేఖ రాశారు. నీరవ్‌ మోదీతో హస్ముక్‌ అథియా ఇప్పటికీ టచ్‌లో ఉంటూ ఆయనకు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు