రొటోమాక్‌కు మరో షాక్‌ : భారీగా ఆస్తులు స్వాధీనం

29 May, 2018 19:21 IST|Sakshi
రొటోమాక్‌ ఛైర్మన్, ఎండీ విక్రమ్ కొఠారి (పాత చిత్రం)

సాక్షి, ముంబై : పీఎన్‌బీ స్కాం తరువాత రెండవ అతిపెద్ద బ్యాంకు కుంభకోణంగా నిలిచిన రొటోమాక్‌ వేల కోట్ల రూపాయల స్కాంలో  రొటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, దాని ప్రమోటర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో భారీ షాక్‌ ఇచ్చింది.  కాన్పూర్‌కు చెందిన  రోటోమక్ గ్రూపుకు చెందిన భారీ ఆస్తులను  దర్యాప్తు సంస్థ అటాచ్‌ చేసింది.  సుమారు 177 కోట్ల రూపాయలను ఆస్తులను  స్వాధీనం చేసుకున్నట్టు మంగళవారం ఈడీ తెలిపింది.  కన్సార్టియం ఏడు బ్యాంకుల వద్ద రొటోమాక్ ప్రమోటర్లు రూ.3,690 కోట్ల కుంభకోణం నేపథ్యంలో సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా పిఎంఎల్ఎ  చట్టం కింద  క్రిమినల్‌ కేసు  నమోదు చేసిన ఈడీ తాజాగా చర్యకు దిగింది. 
  
ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడాను రూ.456 కోట్లు మోసం చేసిన కేసులో రొటోమాక్‌ సంస్థ ఛైర్మన్, ఎండీ విక్రమ్ కొఠారి, డైరెక్టర్ రాహుల్ కొఠారితోపాటు, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ అధికారులపైనా  కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తన తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది.  వేలకోట్లను  బ్యాంకును ముంచేసిన  కేసుపై గతమూడు నెలలుగా విచారించిన సీబీఐ..లక్నోలోని ప్రత్యేక కోర్టుకు ఇటీవల తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. అలాగే ఇది కేవలం బీవోబీని మోసం చేసిన దానిపై మాత్రమే చార్జిషీట్ దాఖలు చేసినట్లు..మిగతా సొమ్ముపై విచారణ కొనసాగుతున్నదని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. 

కాన్పూర్ కేంద్రగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రొటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు, సంస్థ డైరెక్టర్ రాహుల్ కొఠారి, బీవోబీ ఏజీఎం ఎస్‌కే ఉపాధ్యాయ, సీనియర్ బ్యాంక్ మేనేజర్ ప్రకాశ్ కపూర్, బ్యాంక్ మేనేజర్ శశి బిశ్వాస్‌లు ఈ తొలి చార్జిషీట్‌లో ఉన్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అలాగే దర్యాప్తుతో  సహకరించడం లేదన్న  ఆరోపణలతో ఢిల్లీలో సీబీఐ  విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడిని అరెస్టు చేయగా, వారు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు