పీఎంసీ స్కామ్‌ : ఈడీ దాడుల్లో విస్తుపోయే విషయాలు

7 Oct, 2019 18:41 IST|Sakshi

ముంబై : పీఎంసీ బ్యాంకు స్కామ్‌కు సంబంధించి హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్లపై ఈడీ జరిపిన దాడుల్లో పోగేసిన అక్రమార్జన ఆనవాళ్లు బయటపడ్డాయి. హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్లు రాకేష్‌, సారంగ్‌ వాధ్వాన్‌లకు చెందిన ప్రైవేట్‌ జెట్‌, పలు విలాసవంతమైన కార్లను గతవారం సీజ్‌ చేసిన ఈడీ సోమవారం అలీబాగ్‌లో 22 గదులతో కూడిన భారీ భవంతి, మరో విమానం, ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న నౌకను గుర్తించింది. ఈ ఆస్తులను ఈడీ త్వరలో అటాచ్‌ చేయనుంది.

హెచ్‌డీఐఎల్‌ కంపెనీ మహారాష్ట్రలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో భారీ భవంతులను రాజకీయ నాయకులకు బహుమతిగా ఇచ్చినట్టు ఈ దాడుల్లో ఈడీ గుర్తించింది. ఏయే రాజకీయ నేతలకు ఈ ఖరీదైన బహుమతులు ముట్టాయనే వివరాలను ఈడీ బహిర్గతం చేయలేదు. వాధ్వాన్‌ల సన్నిహితుల ఆస్తులనూ సోదా చేసేందుకు ఈడీ బృందాలు సన్నద్ధమయ్యాయి. మరోవైపు పీఎంసీ కేసులో ముంబై పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం రూ 4000 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, చరాస్తులు, పొదుపు ఖాతాలను ఇప్పటికే సీజ్‌ చేసింది. హెచ్‌డీఐఎల్‌ సీనియర్‌ అధికారులు, పీఎంసీ బ్యాంక్‌ అధికారులు సంస్థ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జే థామస్‌లను ఈడీ అధికారులు రూ 4355 కోట్ల స్కామ్‌ గురించి విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు