మరిన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లు!

19 Feb, 2015 01:58 IST|Sakshi
మరిన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లు!

- వ్యాపార విస్తరణకు సంస్థల అడుగులు
- ప్రాతీయ మార్కెట్‌పై దృష్టి
- సంప్రదాయ రూట్లో పీవీఆర్, ఐనాక్స్
- భారీ డీల్స్‌తో పెరుగుతున్న కార్నివాల్

సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీతో సినిమా ప్రొడక్షన్ వ్యయం తగ్గింది. దీనికి తగ్గట్టే సినిమాల నిర్మాణం పెరిగింది. దీంతో ప్రాంతీయ భాషా చిత్రాల సంఖ్యలోనూ వృద్ధి  కనిపిస్తోంది. వీటన్నిటికీ తోడు ఇపుడు ఏ సినిమా అయినా సాధారణంగా రెండు మూడు భాషల్లో విడుదలవుతోంది.

ఇవన్నీ కలిసి సినిమా థియేటర్లకు గిరాకీ పెంచుతున్నాయి. సరిగ్గా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే మల్టీప్లెక్స్‌లు భారీ విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నాయి. సినిమాల సంఖ్యకు తగ్గట్టుగా థియేటర్లు పెరగటం లేదని, ఈ లోటును భర్తీ చేయటానికి తాము ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాలపై దృష్టి సారిస్తున్నామని మల్టీప్లెక్స్ సంస్థలు చెబుతున్నాయి. ఇపుడు ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో మాల్స్ కూడా భారీగా వస్తుండటంతో థియేటర్లు ఏర్పాటు చేయటమూ వాటికి పెద్ద కష్టం కావటం లేదు.
 
ప్రాంతీయ మార్కెట్‌పై మల్టీప్లెక్స్‌ల కన్ను
భవిష్యత్తు అవకాశాలన్నీ ప్రాంతీయ మార్కెట్లోనే ఉన్నాయని భావిస్తున్న మల్టీప్లెక్స్ సంస్థలు.. తమ దృష్టిని జాతీయ మార్కెట్ నుంచి ప్రాంతీయ మార్కెట్‌పైకి మళ్లిస్తున్నాయి. ‘‘దేశంలో అధిక సంఖ్యలో చిన్న చిన్న పట్టణాలున్నాయి. వీటిల్లో సినిమాలను వీక్షించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకని మల్టీప్లెక్స్ థియేటర్ సంస్థలు ఈ పట్టణాలపై దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది’’ అనేది మల్టీప్లెక్స్ వ్యాపారంలో అత్యధిక వాటా కలిగి ఉన్న పీవీఆర్ గ్రూప్ అభిప్రాయం. ఎక్కువ థియేటర్లున్న ఐనాక్స్, సినీ పోలిస్, కార్నివాల్ సినిమాస్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే బావుంటుందన్నది సంస్థ అభిప్రాయం.
 
పెరగనున్న మల్టీప్లెక్స్ స్క్రీన్లు: నిజానికి ఇప్పటిదాకా పీవీఆర్, సినీ పోలిస్‌లు సంప్రదాయ విస్తరణపైనే (మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్మాణం) ఎక్కువ దృష్టి కేంద్రీకరించాయి. అంతే తప్ప వేరే సంస్థను కొనుగోలు చేయటం వంటివేమీ చేయలేదు. పీవీఆర్ గత రెండేళ్ల నుంచీ ఏడాదికి 70-75 స్క్రీన్లను పెంచుకుంటూ వెళుతోంది. ఇపుడు ఈ సంఖ్యను 100కు చేర్చే యోచనతో ఉంది. ‘‘దేశంలో సినిమా ప్రదర్శనలో మార్పులు జరుగుతున్నాయి. ఈ సమయంలో సంప్రదాయక విస్తరణ అత్యవసరం. దీనివల్ల కొత్త స్క్రీన్లు వస్తాయి. కార్నివాల్ సంస్థ విస్తరణను స్వాగతిస్తున్నాము. కానీ దీనివల్ల మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్యలో ఎలాంటి మార్పూ ఉండదు. మారింది కేవలం మల్టీప్లెక్స్‌ల ముందు బ్యానర్ మాత్రమే’’ అని పీవీఆర్ గ్రూప్ పేర్కొంది.

కార్నివాల్ సంస్థ ఇటీవల రిలయన్స్ మీడియా వర్క్స్‌కు చెందిన ‘బిగ్ సినిమాస్’లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి ఆ సంస్థను చేజిక్కించుకుంది. దీనివల్ల బిగ్ సినిమాస్ థియేటర్లన్నీ ఇకపై కార్నివాల్ సినిమాస్‌గా మారతాయని, అంతేతప్ప కొత్తగా స్క్రీన్లు పెరగటం వంటిది జరగదనేది పీవీఆర్ అభిప్రాయం. మరో అగ్రశ్రేణి సంస్థ సినీపోలిస్ కూడా మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్యను మరో 60కి పెంచటానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ‘‘దేశంలో మల్టీప్లెక్స్ పరిశ్రమ మరింత విస్తరించే అవకాశాలున్నాయి.

ఫన్ సినిమాతో ఒప్పందం చేసుకునేదాకా మేం ఒంటరిగానే వ్యాపార విస్తరణను చేపట్టాం. ప్రస్తుతం దేశంలో చాలా చైన్ మల్టీప్లెక్స్‌లు మావే. సంప్రదాయక విస్తరణపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాం. ఉనికి, లాభదాయకతపైనే వ్యాపార వృద్ధి అధారపడి ఉంటుంది’’ అని గ్రూప్ అభిప్రాయపడింది. ఈ ఏడాది కార్నివాల్ కూడా తన స్క్రీన్ల సంఖ్యను 500కు పెంచటానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ సంస్థలు కొత్త స్క్రీన్లను మొదట కోల్‌కతా, తర్వాత బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీలలో నిర్మించనున్నాయి.
 
మనకు థియేటర్ల సంఖ్య సమస్యేనా?

‘‘సినిమాల సంఖ్య పరంగా చూస్తే మనకు ఎలాంటి సమస్యా లేదు. ఎందుకంటే దేశంలో ఏటా 1000కి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. సంవత్సరానికి 4 బిలియన్ల టికెట్లను విక్రయిస్తున్నాం. మనకు ఉన్న సమస్యల్లా వాటి ప్రదర్శనకు తగినన్ని థియేటర్లు లేకపోవటమే’’ అనేది ఐనాక్స్ గ్రూప్ మాట. 10 లక్షల జనాభాకు మనం 9 స్క్రీన్లను (2 మల్టీప్లెక్స్‌లు) మాత్రమే కలిగి ఉంటే చైనా 25 స్క్రీన్లను కలిగి ఉందని సంస్థ వెల్లడించింది. మన దేశంలోని మొత్తం మల్టీప్లెక్స్ స్క్రీన్లు 2,050 మాత్రమే.

మరిన్ని వార్తలు