చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం

2 Nov, 2019 16:23 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగిత రేటు పెరిగిందని ప్రముఖ అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం తన అధ్యయనంలో పేర్కొంది. కాగా 2011-12, 2017-18 సంవత్సరాలలో దేశంలో 90లక్షల మంది ఉపాధికి దూరమయ్యారని తెలిపింది. కాగా దేశంలో 2011-12సంవత్సరాలలో 474మిలియన్లుగా ఉన్న ఉపాధి 2017-18లో 465 మిలియన్లకు పడిపోయిందని ఎంప్లాయిమెంట్‌ క్రైసిస్‌ అనే కొత్త నివేదిక పేర్కొంది. యువత, శ్రామికులు, విద్యావంతులు నిరుద్యోగంలో మగ్గిపోతున్నారని తమ అధ్యయంలో తేలినట్లు స్పష్టం చేసింది. 

నివేదికలోని కీలక అంశాలు
నివేదిక ప్రకారం ప్రైవేట్‌ రంగంలో ఉపాధి స్వల్పంగా పెరిగింది.  ప్రభుత్వ రంగంలో అసంఘటిత రంగానికి మెరుగైన ఉపాధి కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమ రంగాలు సైతం ఏ విధమైన కాంట్రాక్టు లేకుండా ఉపాధిని కల్పిస్తున్నట్లు తెలిపింది. దేశంలో వ్యవసాయేతర రంగాలలో  సేవల రంగం అత్యధిక ఉపాధిని కల్పిస్తున్నదని తెలిపింది. కానీ పెరుగుతున్న జనాభాకు, చదువుకున్న లక్షలాది విద్యార్థులకు ఆశించిన మేర ఉపాధి లభించలేదని నివేదిక తెలిపింది. 

కాగా వ్యవసాయ రంగం 2011-12, 2017-18 సంవత్సరాల్లో సుమారు 27 మిలియన్ల మేర ఉపాధి  క్షీణించింది అని తెలిపింది. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉపాధి వాటా కూడా 49 శాతం నుండి 44 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. తయారీయేతర రంగాలలో ముఖ్యంగా నిర్మాణ రంగం 2004-05, 2011-12 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తే (2011-12), (2017-18) మధ్య కాలంలో కేవలం 0.6 మిలియన్ మాత్రమే సృష్టించిందని నివేదిక పేర్కొంది.

దేశంలో శ్రామిక, విద్య  శిక్షణ (ఎన్‌ఎల్‌ఇటి) పొందని యువత 2004-05, 2011-12 లో మూడు మిలియన్లు ఉంటే 2017-18లో 100మిలియన్లు ఉన్నారని నివేదిక తెలిపింది. 2017-18లో ఎన్‌ఎల్‌ఇటి యువత అత్యధిక కలిగిన రాష్ట్ర్రాలలో యూపీ మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానాలలో బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, అసోం తదితర రాష్ట్రాలు ఉన్నాయి.

ఇక సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు 68శాతం ఉపాధిని  కల్పిస్తున్నట్లు నివేదిక తెలిపింది. కాగా 2017-18 సంవత్సరం తయారీ రంగంలో 61శాతం ఉపాధిని కల్పిస్తుండగా, తయారీయేతర రంగాలలో 66శాతం నుంచి 71శాతానికి ఉపాధిని కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా దేశంలో రిజిస్టర్డ్ సంస్థల సంఖ్య భారీగా పెరిగాయి. కానీ మెరుగైన వ్యాపారం కోసం జీఎస్‌టి కింద సంస్థలను నమోదు చేసుకున్నప్పటికీ, వారి వ్యాపారం తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలతో కూడిన ఉపాధిని కల్పించలేకపోయారని నివేదిక తెలిపింది.

మరిన్ని వార్తలు