పీఎఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ : ఉద్యోగులకు శుభవార్త

11 Mar, 2019 19:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ బదిలీ  విషయలోఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు శుభవార్త. ఇకపై మీరు ఉద్యోగం మారిన ప్రతీసారీ ఈపీఎఫ్‌ అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.  ఉద్యోగం మారిన వెంటనే.. ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యే  సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది.   వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ తాజా సదుపాయం అమలులోకి రానుంది. పైలట్ ప్రాతిపదికన ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ఆటోమేషన్‌ను  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.   ఈపీఎఫ్‌వోను డిజిటల్‌  సంస్థగా మార్చే క్రమంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు.

కొత్త సంస్థలో చేరిన తర్వాత ఈపీఎఫ్ ప్రక్రియ మొదలుకాగానే యూఏఎన్ నెంబర్ ఆధారంగా పాత ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్, వడ్డీ ఆటోమెటిక్‌గాబదిలీ అవుతాయి. దీని వల్ల గత సంస్థలో పనిచేసిన పదవీకాలంలో పొందిన ప్రయోజనాలన్నీ కొనసాగుతాయని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ తాజా వెల్లడించింది. వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా మొత్తం ఖాతాదారులందరికీ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని  భావిస్తున్నట్లు సీనియర్ కార్మిక శాఖ అధికారి ఒకరు  చెప్పారు. 

మరిన్ని వార్తలు