పీఎఫ్‌ చందాదారులకు శుభవార్త

17 Sep, 2019 16:12 IST|Sakshi

8.65 శాతం పీఎఫ్ వడ్డీ రేటు పెంపు అమలులోకి

పండుగ సీజన్ కన్నా ముందుగానే కొత్త వడ్డీ రేటు వర్తింపు

6 కోట్ల మంది  పీఎఫ్‌  చందాదారులకు  తీపి కబురు  

సాక్షి, న్యూఢిల్లీ:  ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారులకు శుభవార్త అందించింది. 2018-19 సంవత్సరానికి 6 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లోకి త్వరలోనే వడ్డీని చెల్లించనున్నారు.  మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే కొత్త వడ్డీ రేటు అమలులోకి వస్తుందని, తద్వారా  ఆరు కోట్ల మంది  ఖాతాదారులకు ప్రయోజనం  చేకూరనుందని  తెలిపారు.  2018-19 సంవత్సరానికి గాను 8.65శాతం వడ్డీని చెల్లించనున్నామన్నారు.  పండుగ సీజన్ కన్నా ముందుగానే పీఎఫ్  ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ రేటు లభిస్తుందని సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇది 8.55 శాతం మాత్రమే. 

2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు వారి  పీఎఫ్  ఖాతాల్లో త్వరలోనే 8.65 శాతం వడ్డీ రేటు లభిస్తుందని  మంత్రి స్పష్టం చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరపు వడ్డీ రేటుతో (8.55 శాతం) పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం పీఎఫ్ వడ్డీ 10 బేసిస్ పాయింట్లు (8.65 శాతం) ఎక్కువగా ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి గత మూడేళ్లలో  ఈపీఎఫ్‌ వడ్డీ రేటు పెరగడం ఇదే తొలిసారి.  2015–16 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీరేట్లు 8.8 శాతం ఉండగా అప్పటి పరిస్థితుల రీత్యా వాటిని క్రమంగా ఐదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి తగ్గించారు. 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును అందించిన తరువాత 151.67 కోట్ల మిగులు ఉంటుందని ఈపీఎఫ్‌వో అంచనా.  మునుపటి ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.7 శాతం  వడ్డీ రేటును అందించడంపై 158 కోట్ల లోటు ఉండేది. అందుకే 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును అందించాలని నిర్ణయించింది.

>
మరిన్ని వార్తలు