మార్కెట్లో బలహీనత కొనసాగుతుంది ..!

23 May, 2020 16:57 IST|Sakshi

నిపుణుల విశ్లేషణ

ప్రపంచవ్యాపంగా నెలకొన్న ఉద్రిక్తతలకు తోడు కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో తక్షణ ఉపశమనం లేకపోవడంతో ఈ వారం మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. అనూహ్యంగా డీఐఐలు అమ్మకాలు చేపట్టారు. 2016 మార్చి తరువాత ఈ ఏప్రిల్‌ వారు రూ.7,965.50 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. 

లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం దేశీయ ఇన్వెస్టర్లు వారి దైనందిన కార్యకలాపాలకు లిక్విడిటి అవసరమైన నేపథ్యంలో విక్రయాలు పాల్పడ్డారు. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా జూన్‌1 నుంచి విక్రయాలు అధికంగా జరగవచ్చు. ఎఫ్‌పీఐఐలు కూడా వారి సంప్రదాయానికి  భిన్నంగా భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విక్రయాలు జరపడం అశ్చరపరిచింది. అయితే ఉద్దీపనలు, రిస్క్‌ అసెట్స్‌ తదితర అంశాలతో అమెరికా మార్కెట్‌ ఎఫ్‌ఐఐలను భారీగా ఆకర్షించింది. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు చైనాతో ఆర్థిక సంబంధం గురించి పునఃపరిశీస్తామనే వ్యాఖ్యలు రాబోయే కాలంలో మార్కెట్లను ఒత్తిడికి గురి చేస్తుంది. ఇప్పటికిప్పడు ఇన్వెస్టర్లను ఉత్సాహపరిచే వార్తలేవీ లేకపోవడం మార్కెట్‌ పతనం కొనసాగే అవకాశం ఉంది. నిఫ్టీ స్వల్పకాలంలో 8500 స్థాయికి చేరుకోవచ్చు. 

ఈ వారపు ప్రధాన ఈవెంట్‌..
ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న మాంద్య ఆందోళనల నేపథ్యంలో ఆర్‌బీఐ బ్యాంక్‌ రెపోరేటును 40బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. అలాగే అన్ని రకాల టర్మ్‌ లోన్లపై 3నెలల పాటు తాత్కలిక నిషేధాన్ని పొడగించింది. తద్వారా లిక్విడిటీ సడలింపులో ఎలాంటి రాజీ లేకుండా, అవసరమైతే రేట్లను మరింత తగ్గేంచేందుకు వీలుగా సర్దుబాటు ధోరణి నే కొనసాగిస్తామని ప్రకటించింది. 

మారిటోరియం 3నెలల పొడగింపు వేతన జీవులకు భారీ ఊరటను కలిగించే అంశమే, కాని లిస్టెడ్‌ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రతికూలంగా మారునుంది. మారిటోరియం పొడిగింపు అపరాధ రేట్ల అవకాశాన్ని పెంచుతుంది. బ్యాంకుల, ఎన్‌బీఎఫ్‌సీల బ్యాలెన్స్ షీట్లను నిర్వీర్యం చేస్తుంది. అలాగే లాభదాయకతను ప్రభావితం చేస్తుంది. సరఫరా వైపు షాక్ కారణంగా స్వల్పకాలికంలో అధిక ద్రవ్యోల్బణం పెద్ద ఆందోళనను కలిగిస్తుంది. అయితే ఆర్‌బీఐ రెండో అర్థభాగంలో ద్రవ్యోల్బణం దిగివస్తుందని భావిస్తుంది. సప్లై చైన్‌ సాధారణ పరిస్ధితులు నెలకొనేందుకు చాలా సమయం పడుతుంది కాబట్టి ఇది జరగకపోవచ్చు. అందువల్ల, అధిక ద్రవ్యోల్బణం,  తక్కువ వడ్డీ రేట్లు వినియోగదారుల / పెట్టుబడిదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని మరింత తగ్గిస్తుంది.

టెక్నికల్‌ అవుట్‌లుక్‌

నిఫ్టీ ఇండెక్స్‌ వరుసగా 3వారం నష్టాలతో ముగిసింది. ఇండెక్స్‌ మార్చి కనిష్టస్థాయి నుంచి 30శాతం ర్యాలీ చేసిన తర్వాత తిరిగి 10శాతం పతనమైంది. అంటే ఇప్పుడు ఇండెక్స్‌ మార్చి కనిష్ట స్థాయి నుంచి 20 శాతం పైన ట్రేడ్‌ అవుతోంది. బ్యాంకింగ్‌ ఇండెక్స్‌లో ఇప్పటికీ బలహీనత కొనసాగుతుంది. కనిష్ట స్థాయి నుంచి కేవలం 8శాతం పెరిగింది. ఇప్పుడు భారతీయ మార్కెట్‌ ప్రపంచమార్కెట్ల తీరుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. గత 2రెండు వారాల నుంచి దేశీయ మార్కెట్‌ నష్టాలను మూటగట్టుకుంటుంది. ఇప్పుడు నిఫ్టీకి 8700 వద్ద కీలక మద్దతు స్థాయి, 9200 వద్ద నిరోధ స్థాయిని కలిగి ఉంది. 

వచ్చే వారం మార్కెట్‌ను ప్రభావితం అంచనాలు:-
మార్కెట్ ప్రతికూలత అంశాలతో నిండిపోయి ఉం‍ది. కోవిడ్‌-19 వైరస్‌కు ఔషధం కనుక్కొన్నారనే వార్తలు మాత్రమే మార్కెట్‌ను గట్టెక్కిస్తాయి. త్రైమాసిక గణాంకాలు మార్కెట్‌ను ప్రభావితం చేసే మరో అంశం. అమెరికా అభివృద్ధి లాంటి చెందిన దేశాల్లో త్రైమాసిక ఫలితాల ప్రకటన అంకం ముగిసింది. అమెరికాలో ప్రధాన కంపెనీ సీఈవోల పాటు ఫెడ్‌ ఛైర్మన్‌ వ్యాఖ్యలు విశ్లేసిస్తే .. మార్కెట్లలో పతనం ముందుందు చాలా ఉందనే అంశం మనకు స్పష్టమవుతుంది. అందువల్ల, ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండటం, నగదు భద్రపరుచుకోవడం ఉత్తమం.

మరిన్ని వార్తలు