అవమానాల నుంచి..విప్లవాలనెంచి

26 Jan, 2019 02:44 IST|Sakshi

ఒకప్పుడు ఆంక్షల మధ్య దిగుమతులు.. ఇప్పుడు ప్రపంచదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్‌..

తినేందుకు తిండి లేదు.. రోగమొస్తే మందుబిళ్లకూ దిక్కులేని స్థితి.. గణతంత్ర రాజ్యంగా అవతరించినప్పుడు ఇదీ భారత్‌ పరిస్థితి! మరి ఇప్పుడు.. అన్ని రంగాల్లోనూ స్వయంసమృద్ధి.. అగ్రరాజ్యాల కళ్లు కుట్టే స్థాయిలో ఆర్థిక అభివృద్ధి! శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారత్‌ ఘన విజయాలను తరచిచూస్తే.. 

హరిత విప్లవం విజయాలు.. 
1947 నాటికి గోధుమ దిగుబడి    60 లక్షల టన్నులు 
వరి దిగుబడి    24 లక్షల టన్నులు 
2017–18 నాటికి గోధుమలు    10 కోట్ల టన్నులు 
వరి దిగుబడి    11.2 కోట్ల టన్నులు

క్షీర విప్లవం..(1955లో దిగుమతులు) 
వెన్న    500 టన్నులు 
పాలపొడి    3,000 టన్నులు 
2016లో భారత్‌ ఎగుమతి చేసిన పాలు    36 వేల టన్నులు 
2018 నాటికి పాలు, పాల ఉత్పత్తుల ఎగుమతుల విలువ    17.2 కోట్ల డాలర్లు 

క్షీర విప్లవానికి ఆద్యుడు వర్గీస్‌ కురియన్‌ అని చాలామందికి తెలుసు. అప్పట్లో పాలను పొడిగా మార్చే సాంకేతికతను భారత్‌కు ఇచ్చేందుకు ఐరోపా దేశాలు నిరాకరించాయి. దీంతో హెచ్‌.ఎం.దలయా అనే డెయిరీ శాస్త్రవేత్త మామూలు స్ప్రే గన్, ఎయిర్‌ హీటర్ల సాయంతో ఓ యంత్రాన్ని తయారు చేయడంతో పరిస్థితి మారింది. గేదె పాలను పొడిగా మార్చలేమన్న యూరోపియన్ల అంచనాను తప్పు అని నిరూపించారు. హెచ్‌.ఎం.దలయా వల్లే భారత్‌లో క్షీర విప్లవ ప్రస్థానం మొదలైంది. 

ప్రపంచానికి మందులిచ్చాం
విదేశీ కంపెనీల పెత్తనం నుంచి మూడో అతిపెద్ద మం దుల తయారీ కేంద్రంగా ఎదగడం వరకు గత 70 ఏళ్లలో భారత ఫార్మా రంగం సాధించిన ప్రగతి అనితర సాధ్యమనే చెప్పాలి. 1954లో హిందుస్తాన్‌ యాంటీబయోటిక్స్‌ లిమిటెడ్, ఆ తర్వాతి కాలంలో సోవియట్‌ యూనియన్‌ సాయంతో ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటుతో బహుళజాతి కంపెనీల ఒంటెత్తు పోకడలకు అడ్డుకట్ట పడితే.. 1970లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేటెంట్‌ చట్టాన్ని సవరించడంతో జెనరిక్‌ మందుల తయారీ సులువైంది. నేషనల్‌ కెమికల్‌ లేబొరేటరీస్, రీజినల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ (ఇప్పుడు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)లు మందుల తయారీ రంగంలో పరిశోధనలకు ఊతమిచ్చాయి. ఐఐసీటీ వంటి సీఎస్‌ఐఆర్‌ పరిశోధనశాలలు సిప్రోఫ్లాక్సిన్, అజిత్రోమైసిన్, డైక్లోఫెనాక్‌ వంటి మందులను చౌకగా తయారు చేయడం.. ఆ టెక్నాలజీని ప్రైవేట్‌ కంపెనీలకు బదలాయించడంతో జనరిక్‌ మందుల విప్లవం మొదలైంది. 

విదేశీ కంపెనీల పెత్తనం నుంచి మూడో అతిపెద్ద మం దుల తయారీ కేంద్రంగా ఎదగడం వరకు గత 70 ఏళ్లలో భారత ఫార్మా రంగం సాధించిన ప్రగతి అనితర సాధ్యమనే చెప్పాలి. 1954లో హిందుస్తాన్‌ యాంటీబయోటిక్స్‌ లిమిటెడ్, ఆ తర్వాతి కాలంలో సోవియట్‌ యూనియన్‌ సాయంతో ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటుతో బహుళజాతి కంపెనీల ఒంటెత్తు పోకడలకు అడ్డుకట్ట పడితే.. 1970లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేటెంట్‌ చట్టాన్ని సవరించడంతో జెనరిక్‌ మందుల తయారీ సులువైంది. నేషనల్‌ కెమికల్‌ లేబొరేటరీస్, రీజినల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ (ఇప్పుడు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ))లు మందుల తయారీ రంగంలో పరిశోధనలకు ఊతమిచ్చాయి. ఐఐసీటీ వంటి సీఎస్‌ఐఆర్‌ పరిశోధనశాలలు సిప్రోఫ్లాక్సిన్, అజిత్రోమైసిన్, డైక్లోఫెనాక్‌ వంటి మందులను చౌకగా తయారు చేయడం.. ఆ టెక్నాలజీని ప్రైవేట్‌ కంపెనీలకు బదలాయించడంతో జనరిక్‌ మందుల విప్లవం మొదలైంది. 

ఐటీతో మున్ముందుకు
తమకు అక్కరకు రాని యంత్రాలను భారత్‌కు పంపడం.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం.. ఇదీ 1960– 70లలో దేశంలోని డేటా ప్రాసెసింగ్‌ రంగం పరిస్థితి. ఐబీఎం, ఐసీఎల్‌ కంపెనీల గుత్తాధిపత్యం ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు మిలిటరీ, పరిశోధన సంస్థల్లోనూ ఇదే తంతు. ఈ నేపథ్యంలో 1970లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఏర్పాటైంది. ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐఎల్‌), కంప్యూటర్‌ మెయిన్‌టెనెన్స్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ), స్టేట్‌ ఎలక్ట్రానిక్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ల ఏర్పాటుతో దేశంలో ఐటీ విప్లవానికి బీజాలు పడ్డాయి. రైల్వే రిజర్వేషన్ల కంప్యూటరీకరణకు ప్రత్యేకమైన టెక్నాలజీని అభివృద్ధి చేసిన తర్వాత వెనుదిరిగి చూసింది లేదు. ఐటీ ఉత్పత్తులు, సేవల రంగంలో ఈ రోజు భారత్‌ ఓ తిరుగులేని శక్తి.

 టెలికం విప్లవం
ఒకప్పుడు ఇంటికి ఫోన్‌ కావాలంటే నెలల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి. టెలికామ్‌ రంగంలో కీలకమైన స్విచింగ్‌ టెక్నాలజీ కొన్ని బహుళజాతి కంపెనీల చేతుల్లోనే ఉండటం ఇందుకు కారణం. అయితే 1960లలో టెలికామ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుతో దేశంలో టెలికామ్‌ విప్లవానికి అంకురం పడింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత్‌ తొలిసారి 100 లైన్ల ఎలక్ట్రానిక్‌ స్విచ్‌ను అభివృద్ధి చేయగలిగింది. ఇదే సమయంలో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్, ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు సంయుక్తంగా మిలటరీ అవసరాల కోసం డిజిటల్‌ ఆటోమేటిక్‌ ఎలక్ట్రానిక్‌ స్విచ్‌ తయారు చేశారు. 1984లో శాం పిట్రోడా నేతృత్వంలో సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ (సీ–డాట్‌) ఏర్పాటుతో పల్లెపల్లెనా టెలిఫోన్‌ ఎక్సే ్చంజ్‌ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీ–డాట్‌ అభివృద్ధి చేసిన టెక్నాలజీని ప్రైవేట్‌ కంపెనీలకు ఉచితంగా ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రామీణ ప్రాంతాల్లోనూ టెలిఫోన్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.     

సమాచార విప్లవం
1975.. భారత్‌ సొంత ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించిన సంవత్సరం. ఐదేళ్లు తిరగకుండానే ఎస్‌ఎల్వీ–3 రాకెట్‌తో రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన ప్రయోగించిన మొత్తం ఉపగ్రహాలు 238 వరకు ఉంటే అందులో విదేశీ ఉపగ్రహాలు 104. ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్‌ శ్రేణి ఉపగ్రహాలు దేశంలో సమాచార విప్లవానికి నాంది పలికాయి. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, వాతావరణ అంచనాలు, తుపాను హెచ్చరికలను సామాన్యుడికి చేరువ చేసిందీ పరిణామం. హాలీవుడ్‌ సినిమా బడ్జెట్‌ కంటే తక్కువ ఖర్చుతో అంగారకుడిపైకి అంతరిక్ష నౌకను పంపగలిగినా.. జాబిల్లిపై నీటి జాడను కనిపెట్టేందుకు ప్రయోగాలకు కేంద్రంగా నిలిచినా అది భారత్‌కే చెల్లింది.

సొంతంగా రాకెట్‌ కూడా తయారు చేసుకోలేని దశ నుంచి ఇరుగుపొరుగు దేశాలకు జీపీఎస్‌ వ్యవస్థలను అందించే స్థాయికి ఎదగడం మనం గర్వించాల్సిన విషయమే! అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకే వాడాలని మన విధానం. విద్య, ఆరోగ్యం దేశ నలుమూలలకు చేర్చేందుకు ఉపగ్రహాలను వాడతామని 1960లలో ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ ఆలోచనలను పట్టించుకున్న వారు కొందరే. రాకెట్, ఉపగ్రహ నిర్మాణంలో అప్పటికి మనకున్న టెక్నాలజీ సున్నా! అయితే దశాబ్దం తర్వాత ఆర్యభట్ట ప్రయోగంతో భారత్‌ తన సత్తా చాటుకుంది. 


 

మరిన్ని వార్తలు