విస్తరిస్తున్న విలాస మార్కెట్‌ 

1 Mar, 2018 01:02 IST|Sakshi

ఈ ఏడాది 30 బిలియన్‌ డాలర్లకు: అసోచామ్‌ 

వచ్చే మూడేళ్లలో ఐదు రెట్ల వృద్ధి అవకాశాలు 

ముంబై: ఖరీదైన బ్రాండెడ్‌ ఉత్పత్తుల వినియోగం పట్ల మక్కువ చూపే వారి సంఖ్య పెరుగుతోంది. అంతర్జాతీయ బ్రాండెడ్‌ ఉత్పాదనలు అందుబాటులోకి వస్తుండడంతో ఈ మార్కెట్‌ 30 శాతం వృద్ధితో డిసెంబర్‌ నాటికి 30 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుత దేశీయంగా సంపన్న ఉత్పత్తుల మార్కెట్‌ విలువ 23.8 బిలియన్‌ డాలర్ల మేర ఉంది. ‘‘యువతలో అంతర్జాతీయ బ్రాండ్ల వినియోగం పెరుగుతుండటం, చిన్న పట్టణాల్లో ఉన్నత తరగతి ప్రజలు కొనుగోలు శక్తితో లగ్జరీ కార్లు, బైక్‌లు, విదేశీ పర్యటనలు, దూర ప్రాంత వివాహాలు తదితర వాటితో ఈ మార్కెట్‌ ఈ ఏడాది చివరికి 30 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది’’ అని అసోచామ్‌ తన నివేదికలో పేర్కొంది. రానున్న మూడేళ్లలో ఈ మార్కెట్‌ ఐదు రెట్ల మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. 

వృద్ధికి కారకాలు...
∙మిలియనీర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో మూడు రెట్లు పెరగనుండటం.  
∙ఆర్థిక వృద్ధి పట్టణీకరణకు దారితీయడం, ఆదాయం పెరుగుతుండటం.  
∙విలాస ఉత్పత్తుల అందుబాటు, మరిన్ని విలాస బ్రాండ్లు దేశంలోకి ప్రవేశించడం. 
∙చిన్న పట్టణాల్లో ఇంటర్నెట్‌ వ్యాప్తి, ఖర్చు చేసే ఆదాయం పెరగడం వల్ల 2020 నాటి కి ఇంటర్నెట్‌పై 10 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. దీంతో ఖరీదైన ఉత్పత్తుల వినియోగం ఎన్నో రెట్లు పెరగనుంది. 
∙వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా బ్రాండ్లను ప్రమోట్‌ చేసుకోవడం.  
∙రిటైల్‌ పరిశ్రమకు సంబంధించి సానుకూల విధానాల ఫలితంగా అంతర్జాతీయ బ్రాండ్లకు ఆకర్షణీయంగా మారిన భారత్‌ మార్కెట్‌. 

మరిన్ని వార్తలు