ఫలితాలు, గణాంకాలు కీలకం
ఒడిదుడుకులు కొనసాగుతాయ్
ఈ వారం మార్కెట్పై విశ్లేషకుల అంచనా
ఈ వారంలో ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి కీలక కంపెనీలు క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. కంపెనీల క్యూ1 ఫలితాలతో పాటు ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయ సంకేతాలు, కరోనా వైరస్ సంబంధిత వార్తలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి.
నేడు ‘రిటైల్’ గణాంకాలు..
నేడు రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, రేపు(మంగళవారం)టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. విప్రో, బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ తదితర 60 కంపెనీలు క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. బుధవారం (ఈ నెల 15న) జరిగే రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ ఏజీఎమ్(వార్షిక సాధారణ సమావేశం) కూడా కీలకం కాన్నుది.
ఒడిదుడుకులు తప్పవు..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాల వెల్లడి గత వారం నుంచి మొదలైంది. కరోనా కట్టడికి ఉద్దేశించిన లాక్డౌన్ పూర్తి ప్రభావం ఈ ఫలితాలపై ఉంటుంది. ఈ ఫలితాల సందర్భంగా కంపెనీలు చేసే వ్యాఖ్యలు మార్కెట్లో ఒడిదుడుకులకు కారణం కానున్నాయని నిపుణులంటున్నారు. గత వారం మార్కెట్ లాభపడినందున ఈ వారం లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనీ అంచనా.
రూ.2,867 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి..
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ మన మార్కెట్ నుంచి రూ.2,867 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. లాభాల స్వీకరణే దీనికి ప్రధాన కారణం.