ఎగుమతులు పెరిగాయ్‌... దిగుమతులు తగ్గాయ్‌!

15 Aug, 2019 04:19 IST|Sakshi

జూలైలో ఎగుమతులు 2.25 శాతం అప్‌

దిగుమతులు 10.43 శాతం క్షీణత

వెరసి తగ్గిన వాణిజ్య లోటు 13.43 బిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు 2019 జూలైలో కేవలం 2.25 శాతం (2018 జూలైతో పోల్చి) పెరిగాయి. విలువ రూపంలో 26.33 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2018 జూలైలో ఈ విలువ 25.75 బిలియన్‌ డాలర్లు. కాగా  అయితే దిగుమతులు మాత్రం 10.43 శాతం తగ్గాయి. విలువ రూపంలో 39.76 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 13.43 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి. చమురు, బంగారం దిగుమతులు పడిపోవడం వాణిజ్యలోటు తగ్గుదలపై సానుకూల ప్రభావం చూపింది.  ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► రసాయనాలు, ఇనుము, ఫార్మా రంగాల నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి.
► అయితే రత్నాలు, ఆభరణాలు (–6.82 శాతం), ఇంజనీరింగ్‌ గూడ్స్‌ (–1.69 శాతం), పెట్రోలియం ప్రొడక్టుల (–5%) ఎగుమతులు పెరక్కపోగా క్షీణించాయి.  
► పసిడి దిగుమతులు 42.2 శాతం పడిపోయి 1.71 బిలయన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
► చమురు దిగుమతులు 22.15% క్షీణించి 9.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతులు 5.92 శాతం పడిపోయి, 30.16 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.
 

తొలి నాలుగు నెలల్లో నీరసం
2019 ఏప్రిల్‌ నుంచి జూలై వరకూ ఎగుమతులు 0.37 శాతం క్షీణించి (2018 ఇదే నెలలతో పోల్చి) 107.41 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు సైతం 3.63 శాతం క్షీణించి 166.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 59.39 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ కాలంలో చమురు దిగుమతులు 5.69 శాతం తగ్గి 44.45 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.

2019 జూన్‌లో విడుదల చేసిన ఒక నివేదికలో ప్రపంచబ్యాంక్‌ గ్లోబల్‌ ఎగుమతులపై ప్రతికూల అవుట్‌లుక్‌ను ఇచ్చింది. 2019లో కేవలం 2.6 శాతంగా గ్లోబల్‌ ట్రేడ్‌ నమోదవుతుందని నివేదిక తెలిపింది. అంతక్రితం అంచనాకన్నా ఇది ఒకశాతం తక్కువ.

అంతర్జాతీయ ప్రతికూలత
ఎనిమిది నెలల తర్వాత జూన్‌లో భారత ఎగుమతులు మొదటిసారి క్షీణతలోకి జారాయి. ఈ క్షీణత 9.71 శాతంగా నమోదయ్యింది. జూలైలో కొంత మెరుగుదలతో 2.25 శాతంగా నమోదయ్యాయి. అయినా ఉత్సాహకరమైన పరిస్థితి ఉందని చెప్పలేం.  వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు భారత్‌ ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఎగుమతిదారులకు సంబంధించి దేశీయంగా వేగవంతమైన రుణ లభ్యత, వడ్డీల తగ్గింపు, అగ్రి ఎగుమతులకు రాయితీలు, విదేశీ పర్యాటకులకు అమ్మకాలపై ప్రయోజనాలు, జీఎస్‌టీ తక్షణ రిఫండ్‌ వంటి అంశాలపై కేంద్రం తక్షణం దృష్టి సారించాలి.  
– శరద్‌ కుమార్‌ షరాఫ్, ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్‌

రూపాయి క్షీణత ప్రభావమే..
జూన్‌ నెలలో క్షీణత బాట నుంచి జూలైలో వృద్ధి బాటకు భారత్‌ ఎగుమతులు వచ్చాయంటే, డాలర్‌ మారకంలో రూపాయి గడచిన ఆరు వారాల 3.5 శాతం క్షీణించడమే కారణం. స్వల్పకాలికంగా ఎగుమతుల్లో సానుకూలత రావడానికి ఇదే కారణం.
– మోహిత్‌ సింగ్లా, టీపీసీఐ చైర్మన్‌

మరిన్ని వార్తలు