ఆపిల్‌ సీఈవో ఆరోపణలు తిప్పికొట్టిన జుకర్‌బర్గ్‌

3 Apr, 2018 12:02 IST|Sakshi
మార్క్‌ జుకర్‌బర్గ్‌ - టిమ్‌ కుక్‌

ఫేస్‌బుక్‌ బిజినెస్‌ మోడల్‌పై ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ చేసిన విమర్శలను ఆ కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ తిప్పికొట్టారు. తమ అడ్వర్‌టైజింగ్‌-సపోర్టెడ్‌ బిజినెస్‌ మోడల్‌ను జుకర్‌బర్గ్‌ సమర్థించుకున్నారు. అడ్వర్‌టైజింగ్‌-సపోర్టెడ్‌ బిజినెస్‌ మోడల్‌ ఒక్కటే, తమ సర్వీసులు కొనసాగించడానికి మార్గమని పేర్కొన్నారు. ‘మీరు ఏదీ చెల్లించనప్పుడు మీ మాటల్ని పట్టించుకోం. మీ మాటల్లో ఏ మాత్రం వాస్తవం లేదు’’ అని ఆగ్రహంగా పేర్కొన్నారు. ఒకవేళ తమ బిజినెస్‌ మోడల్‌ కింద యూజర్లపై ఛార్జీలను విధిస్తే, ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్‌కు చెల్లించుకోలేరని అన్నారు. ఫేస్‌బుక్‌ ఎదుర్కొనే ఒకానొక సమస్యల్లో ఇది ఆదర్శవాదమైనదేనని, ప్రజలను కనెక్ట్‌ చేయడంపై తాము ఫోకస్‌ చేసినట్టు తెలిపారు. 

కాగ, ఆపిల్‌ కంపెనీకి ఫేస్‌బుక్‌ పరిస్థితి రాదని, ఎందుకంటే కస్టమర్‌ డేటాను ఆధారం చేసుకుని ఆపిల్‌ ప్రకటనలను విక్రయించదని టిమ్‌ కుక్‌ విమర్శించారు. ఫేస్‌బుక్‌ బిజినెస్‌ మోడల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలను జుకర్‌ బర్గ్‌ తిప్పికొట్టారు. ఫేస్‌బుక్‌ తప్పిదాన్ని బహిరంగంగా ఒప్పుకున్న జుకర్‌బర్గ్‌, ప్రస్తుతం సమస్యలను తీర్చడానికి కొన్నేళ్ల సమయం పడుతుందన్నారు. ఫేస్‌బుక్‌లో లక్షలాది మంది యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలటికా అనే కంపెనీ చోరీ చేయడం, దీనిపై అన్ని వర్గాల నుంచి ఫేస్బుక్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. డేటా లీక్‌ను హైలెట్‌ చేసిన జుకర్‌బర్గ్‌, ప్రస్తుతం యూజర్లు ప్రమాదాలు, దుష్ప్రభావాలపై ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని పేర్కొన్నారు. ఈ తప్పిదాన్ని తాము ఒప్పుకుంటున్నాం, కానీ దీన్ని పరిష్కరించడానికి కొన్ని సంవత్సరాల సమయమైతే పడుతుందని చెప్పారు.  మూడు లేదా ఆరు నెలల్లో సరిచేయాలని తాము కోరుకుంటున్నామని, కానీ వాస్తవంగా ఇంతకంటే ఎక్కువ సమయమే పట్టే అవకాశముందని ఆయన అన్నారు. 

మరిన్ని వార్తలు