ఆ కంపెనీలతో ఎఫ్‌బీ సీక్రెట్‌ డేటా షేరింగ్‌

19 Dec, 2018 14:03 IST|Sakshi

న్యూయార్క్‌ : ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో తాజాగా న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించిన పరిశోధానాత్మక నివేదిక మరింత గుబులు రేపుతోంది. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌, స్పాటిఫై వంటి కంపెనీలు యూజర్ల సమాచారాన్ని వారి అనుమతి లేకుండా పొందే వెసులుబాటు కల్పిస్తూ ఆయా కంపెనీలతో ఫేస్‌బుక్‌ ప్రత్యేక డేటా షేరింగ్‌ ఒప్పందాలు చేసుకుందని ఈ నివేదిక పేర్కొంది.

బడా టెక్‌ కంపెనీలు, ఈ రిటైల్‌ దిగ్గజాలు సహా 150కి పైగా కంపెనీలతో ఫేస్‌బుక్‌ డేటా షేరింగ్‌ ఒప్పందాలు చేసుకుందని వెల్లడించింది. యూజర్లందరి పేర్లను వారికి తెలియకుండానే చూసేందుకు మైక్రోసాఫ్ట​బింగ్‌ను ఫేస్‌బుక్‌ అనుమతిస్తోంది. యూజర్ల ప్రైవేట్‌ మెసేజ్‌లను చదవడం, రాయడం, డిలీట్‌ చేసేందుకూ స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్‌లను ఫేస్‌బుక్‌ అనుమతిస్తోంది. మరోవైపు యూజర్‌ డేటాను తమ ఫోన్ల ద్వారా సేకరించే క్రమంలో ఎవిడెన్స్‌ను దాచేందుకూ ఎఫ్‌బీ యాపిల్‌కు వెసులుబాటు కల్పిస్తోందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

అమెజాన్‌, యాహూ, మైక్రోసాఫ్ట్‌లతో ఈ తరహా ఒప్పందాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయని, మరికొన్ని కంపెనీలతో ఒప్పందాల కాలపరిమితి ఈ ఏడాదితో ముగుస్తుందని పేర్కొంది. ఈ కంపెనీలు వ్యూహాత్మకంగానే డేటా షేరింగ్‌ ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిపింది. ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను ఆయా కంపెనీలు సంగ్రహించడంతో పాటు ఆ కంపెనీలు సేకరించిన డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకునేలా ఈ ఒప్పందాలు జరిగాయని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం తెలిపింది.

మరిన్ని వార్తలు